టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న ‘యువగళం’ పాదయాత్రపై అనంతపురం డీఐజీ కీలక ప్రకటన చేశారు. లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ వస్తోన్న వార్తలపై శనివారం అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. లోకేష్ పాదయాత్ర అడ్డుకునే ఉద్దేశం పోలీసులకు కానీ, ప్రభుత్వానికి కానీ లేదన్నారు.
లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో నిబంధనల ఉల్లంఘన ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతే కానీ ఇతరత్రా ఇబ్బందులేవీ కలిగించడం లేదన్నారు.ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు లోకేష్ యాత్రలో అడ్డంకులు కల్పిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు.
పాదయాత్రను ఆపాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. పాదయాత్రలు చేసేటప్పుడు నేతల స్ధాయి మేరకు భద్రత కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు డీఐజీ రవిప్రకాష్.
చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యంగా పలమనేరులో లోకేష్ వాహనం సీజ్ అవడంతో పాటు, శుక్రవారం బంగారుపాళ్యంలో బహిరంగసభకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా పోలీసులు స్పందించారు.