అదిగో పులి.. ఇదిగో పులి అంటూ కాకినాడ ప్రజలు నెల రోజుల నుంచి బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఇటు సిక్కోలు జిల్లాలో ఎలుగుబంటి భయం అంతే భీకరంగా వెంటాడుతోంది. ఎప్పుడొస్తుందో తెలీదు. ఎటు నుంచి వస్తుందో తెలీదు. ఒక్కసారిగా దాడిచేసి ప్రాణాలు తీస్తోంది ఎలుగుబంటి.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు .. పగలు రాత్రి తేడా లేదు. అక్కడి జనం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడుపుతున్నారు. కిడిసింగిలో ఎలుగుబంటి బీభత్సం చేసింది. గ్రామంలో దాదాపు ఏడుగురిపై ఎలుగుబంటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే వారిని స్థానికులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎలుగుబంటి దాడులతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఒక ఎలుగుబంటి చేసిన దాడిలో గాయపడిన కోదండరాం అనే రైతు తీవ్రంగా గాయపడి, ఆ తర్వాత మృతి చెందాడు. ఇప్పుడు మళ్లీ అటువంటి దాడే జరిగింది.
Advertisements
వజ్రపు కొత్తూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఎలుగుబంటి దాడి అనేది చాలా సహజంగా మారింది. వరుసగా సంభవిస్తున్న ఘటనలతో బెంబేలెత్తుతున్నారు అక్కడి జనాలు. అటవీశాఖ అధికారులు తమ గోడు వినడం లేదని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తమకి కష్టాలని అంటున్నారు స్థానికులు.