బోగస్ కంపెనీ చేసిన మోసం ఓ మహిళ నిండు ప్రాణాలు బలితీసుకుంది. భర్తకు తెలియకుండా లక్షలు మోసపోవడంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఫిల్మ్ రేటింగ్ పేరుతో జరిగిన కొత్త తరహా మోసానికి ఆమె తనువు చాలించింది. వివరాల్లోకి వెళితే …ఆన్ లైన్ లో ఫిల్మ్ రేటింగ్ ద్వారా లక్షల రుపాయలు లాభలంటూ వచ్చిన..అబద్ధపు ప్రకటనలతో మోసపోతున్న బాధితుల్లో విజయవాడకు చెందిన హిమబిందు కూడా ఒకరు. వాషింగ్టన్ ఫిల్మ్ స్క్వేర్ కంపెనీకి రెండు దఫాలుగా సుమారు 7 లక్షలు చెల్లించింది.
భర్త నాగకృష్ణ ప్రసాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో తొలిసారి డబ్బులు చెల్లించినపుడే అడ్డుకున్నాడు. ఆయనకు తెలియకుండా మరో 7 లక్షల రుపాయలు చెల్లించింది హిమబిందు. డబ్బులు చెల్లించాక సదరు కంపెనీ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు నిర్దారణకు వచ్చిందామె. డబ్బుల విషయంలో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
తాను మోసపోయానని, భర్తకు, కుటుంబ సభ్యులకు మొహం చూపించలేక ఇంటి నుండి వెళ్లిపోయింది హిమబిందు. భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కృష్ణ బ్యారేజ్ వరకు సీసీటీవి లో హిమబిందు కదలికలు రికార్డయ్యాయి. అయితే ఆ తర్వాత ఫుటేజ్ లో ఆమె కనిపించలేదు. హిమబిందు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.