ప్రైవేట్ కాలేజీల ఫీజుల దాష్టీకానికి మరో విద్యార్థి బలి అయ్యాడు. సర్టిఫికేట్స్ లేని కారణంగా ఇప్పటికే ఇంజినీరింగ్ మొదటి కౌన్సిలింగ్ కు హాజరు కాలేకపోయాడు. సర్టిఫికేట్స్ లేని కారణంగా రెండో కౌన్సిలింగ్ కు కూడా హాజరు కాలేనన్న భయంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ చనిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదిభట్ల ఎస్సార్ గాయత్రి కాలేజ్ లో అంజిత్ అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేశాడు. సర్టిఫికెట్ల కోసం 40 వేలు కట్టాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేసిందని పేరెంట్స్ తెలిపారు. ఐతే 40 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనా 15రోజుల తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పిందన్నారు.
సర్టిఫికెట్లు లేకపోవడంతో ఇప్పటికే మొదటి కౌన్సెలింగ్ లో హాజరుకాలేకపోయిన అంజిత్… రెండో విడత కౌన్సెలింగ్ కూడా హాజరు కాలేనన్న మనస్తాపంతో రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఇవాళ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చనిపోయాడు.
అంజిత్ కుటుంబ సభ్యులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడారు. అండగా ఉంటామని చెప్పారు. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తన కొడుకు మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.