కరోనా ఈ పేరు వింటేనే మానవాళి వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల జీవన స్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది కరోనా. అనేక మందిని పొట్టన పెట్టుకొని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కరోనా కారణంగా దేశాలకు దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్ళాయి. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్న పరిస్థితుల్లో.. కరోనా వేరియంట్స్ మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ ముప్పు వచ్చి పడింది. మార్ బర్గ్ వైరస్ డిసీస్ గా పిలిచే ఈ వైరస్ తొలి కేసు పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈక్వటోరియల్ గినియాలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ వో సంస్థ నిర్థారించింది. విపరీతమైన జ్వరం,తీవ్రమైన తలనొప్పి, అయాసం,రక్తపు వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పుల వంటివి ఈ వైరస్ లక్షణాలని తెలిపింది.
ఈ వ్యాధి తొలిసారిగా 1967 లో నమోదైంది. అయితే ఈ ప్రాణాంతక వైరస్ కు చికిత్స లేకపోవడం తీవ్ర కలవరం రేపుతోంది. ఈ వైరస్ ఎబోలాను పోలి ఉంటుందని పేర్కొంది. గినియాలోని కీటెం ప్రావిన్స్ లో దీని బారిన పడిన 9 మంది మరణించారని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. ఈ వైరస్ కు చికిత్స గానీ, వ్యాక్సిన్ గానీ అందుబాటులో లేదని తెలిపింది. వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగాల దశలో ఉన్నాయని స్పష్టం చేసింది.