ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. ఇలాంటి సమయంలో శాస్త్రవేత్తులు పిడుగులాంటి వార్త చెప్పారు. సుమారు 48,500 ఏండ్ల క్రితం నాటి జాంబీ వైరస్ను రష్యన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. గడ్డకట్టిన ఓ సరస్సు అడుగు భాగంలో ఉన్న వైరస్ను శాస్త్రవేత్తలు బయటకు తీశారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
దీంతో పాటు మరి కొన్ని ప్రాణాంతక బ్యాక్టీరియాలను వారు కనుగొన్నారు. ఇవి అంటువ్యాధులను కలుగ జేసే అవకాశం ఉందని, తద్వారా ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే గుర్తుతెలియని ఈ వైరస్ వల్ల ఏవైనా వ్యాధులు వ్యాప్తి చెందుతాయేమోనని, వైరస్ను వెలికితీయడం ప్రమాదకరంగా మారుతుందేమోనని కథనంలో పేర్కొంది.
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఉత్తరార్ధగోళంలో మంచుకరిగిపోతోంది. దీంతో లక్షల యేండ్ల క్రితం అంతరించి మంచులో చిక్కుకున్న ఆర్గానిక్ పదార్థాలు బయటకు వచ్చే ప్రమాదం ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటిలో ప్రాణాంతక బ్యాక్టీరియాలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. పునరుజ్జీవం పొందిన సూక్ష్మజీవులు, పూర్వ చారిత్రక యుగం నుంచి నిద్రాణ స్థితిలో ఉన్న వైరస్లు కూడా ఈ ఆర్గానిక్ పదార్థాల్లో ఉన్నట్టు చెప్పారు.
వీటిని జాంబీ వైరస్లుగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే వీటిలో కొన్నింటిపై శాస్తవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఇందులో పురాతనమైన వైరస్ను ‘పండోరావైరస్ యెడోమా’గా గుర్తించారు. దీన్ని 48,500 ఏళ్ల నాటిదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మంచులో గడ్డకట్టుకుపోయి తిరిగి సాధారణ స్థితికి వచ్చిన వైరస్లన్నింటిలో ఇదే అత్యంత పురాతనమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇతర జీవులకూ సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
2013లో 30వేల ఏండ్ల నాటి వైరస్ను ఇదే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కూడా సైబీరియాలోనే బయటపడటం గమనార్హం. తాజా పరిశోధనల్లో 13 వైరస్ల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. ఒక్కో వైరస్.. ఒక్కో జీనోమ్ కలిగి ఉందని పేర్కొన్నారు. పాండోరావైరస్ ను రష్యాలోని యకుటియాలో ఉన్న యూకెచీ అలాస్ సరస్సు అడుగున గుర్తించారు. మిగిలిన వాటిలో కొన్నింటిని మామోత్ జంతువుల బొచ్చు, సైబీరియా తోడేలు పేగుల్లో గుర్తించారు.
అంటు వ్యాధులుగా మారే సత్తా ఈ జాంబీ వైరస్లకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి వైద్యపరమైన ప్రమాదానికి ఇది సంకేతమని పరిశోధకులు హెచ్చరించారు. మంచులో గడ్డకట్టిన ఆర్గానిక్ పదార్థాలు బయటకు రావడం వల్ల.. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు బయటకు వస్తాయన్నారు.
ఇది గ్రీన్హౌస్ ఎఫెక్ట్ను మరింత పెంచుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ధృవప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతుందని వివరించారు. తద్వారా మరిన్ని వైరస్లు బయటకు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. ఇది విషవలయంగా మారుతుందని హెచ్చరించారు.