ఏపీలో మళ్లీ ప్రమాణాల రగడ కొనసాగుతోంది. వేదపండితులు, అధికారులు, పార్టీ శ్రేణుల మధ్య కాణిపాకంలోని సత్యదేవుడు ముందు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రమాణం చేశారు. తాను ఏ ఆశ్రమం, మఠం వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదు.. ఏ రకమైన రాజకీయ అవినీతికి పాల్పడలేదు అంటూ ప్రమాణం చేశారాయన. ఈ 23 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని చెప్పారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లును ప్రమాణం చేయమని ఆహ్వానిస్తే రాలేదని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన మహిళలను అవమాన పరిచారని… కానీ.. రాచమల్లు ఇంట్లోని ఆడబిడ్డలను కుటుంబ సభ్యులుగా భావించి పసుపు, కుంకుమ, చీర పంపుతానని చెప్పారు. దిగుజారుడు వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్న విష్ణు… రాచమల్లు కాణిపాకం ప్రమాణానికి రాకుండా పారిపోయారని విమర్శించారు. చెప్పిన మాట ప్రకారం తాను వచ్చి ప్రమాణం చేశానన్నారు.
వైసీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు విష్ణువర్ధన్ రెడ్డి. కొద్దిరోజులుగా టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో బీజేపీ, వైసీపీ మధ్య యుద్ధం నడుస్తోంది. అందులోభాగంగానే ఈ ప్రమాణ రాజకీయం జరుగుతోంది.