ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. బీజేపీ నేతలు చేపట్టే ‘జలం కోసం-ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర’లో భాగంగా మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటలకు జలం కోసం-ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర మొదలవుతుందన్నారు. త్రాగు, సాగునీటి ప్రాజెక్ట్ల సాధన కోసం మూడు రోజులు యాత్ర సాగిస్తామన్నారు.
ఇప్పటికే రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామని, ముఖ్య అతిథిగా సునీల్ దేవదర్, ఎంపీలు హాజరవుతారని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. నేరడి బ్యారేజ్, నిర్వాసితుల సమస్యపై యాత్రలో మాట్లాడతామన్నారు. వంశధార నది నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ల నిర్మాణానికి ప్రభుత్వానికి చిత్త శుద్దిలేదని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నదుల అనుసంధానం చేయాలని, కానీ, వాటిని పట్టించుకోలేదని చెప్పారు.
తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తే లక్షల ఎకరాలకు నీరు అందుతుందని.. కేవలం 500 కోట్లు ఇస్తే చాలా ప్రాజెక్ట్లు పూర్తి అవుతాయని మాధవ్ వివరించారు. ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుందని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. అందుకు నిరసనగా బీజేపీ నేతలు ‘జలం కోసం-ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో చేపట్టనున్న ఈ పోరు బాటకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నాయకత్వం వహించనున్నారు. అలాగే, ఈ యాత్రను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించనున్నారు.