జగన్ సర్కార్ కి, ఉద్యోగ సంఘాలకు మధ్య వార్ నడుస్తూనే ఉంది. సీపీఎస్ ను అమలు చేయాలంటూ, సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. దీంతో ఈ నెల 9వ తేదీ నుంచి దశల వారీగా ఆందోళనలు చేస్తున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీతాభత్యాల కోసం ఎదురుచూస్తూ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని అప్పుల వాళ్ల దగ్గర తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
కనీసం జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉద్యోగులకు సందిగ్ధం నెలకొందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. అందుకు నిరసనగా ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తామని ప్రకటించారు. ఈ నెల 9 నుంచి ఏప్రిల్ 3 వరకు దశల వారీగా ఉద్యమం చేస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 5న జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారు?, మీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోగలరా?, ప్రజాప్రతినిధులు జీతాలు వారే నిర్ణయించుకుంటారు.. వారికి పీఆర్సీలతో సంబంధం లేదా? అంటూ ప్రశ్నలు కురిపించారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని ఎందుకు చేయలేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేశారన్నారు. ప్రతిఒక్క ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తమ ఉద్యమానికి ఏపీ సీపీఎస్ఏ కూడా మద్దతు ప్రకటించిందన్నారు. చట్టబద్ధంగా రావాల్సినవి, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చి మరచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే తమ ఉద్యమం అని స్పష్టం చేశారు. డీఏ ఏరియర్స్ లక్షలాది రూపాయల ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారన్నారు. ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేశాయని గుర్తు చేశారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.