ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న భీమ్లానాయక్ సినిమాకు రిలీజ్ కు ముందే షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈ నెల 25న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లకు జగన్ ప్రభుత్వం ముందస్తు నోటీసులు జారీ చేసింది.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో తహసీల్దార్లు వారి పరిధిలోని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు.
‘వకీల్సాబ్’ తర్వాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘భీమ్లానాయక్’ ఐదో ఆటకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ ప్రతి థియేటర్ లోనూ ఐదో ఆటను ప్రదర్శించుకోవచ్చు.
ఇందులో రానా మరో కీలక పాత్ర పోషించారు. సాగర్ కె.చంద్ర ‘భీమ్లా నాయక్’ను తెరకెక్కించారు. తమన్ సంగీత దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ మాటలు అందించారు. అయితే.. ఈ సినిమా బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.