– సరుకు లేని లోకేష్ పాదయాత్ర చేసినా ఏం ప్రయోజనం?
– అది యువగళమో.. గరళమో త్వరలోనే తెలుస్తుంది
– గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ.. అన్నట్టు లోకేష్ రాకతో టీడీపీ పతనం!
– బాబు కొడుకుగా తప్పితే లోకేష్ కు ఏ అర్హత ఉంది?
– తండ్రిపై పవన్ వ్యాఖ్యలపై.. చిరంజీవి, నాగబాబులు సమాధానం చెప్పాలి
– ఎంత మంది కట్టకట్టుకొని వచ్చినా.. జగన్ ఎదుట నిలబడలేరు
– పోలీసులపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు టీడీపీ పతనానికి నాంది
– టీడీపీకి సంస్కారం లేదు.. మీరే భోజనం ఏర్పాట్లు చేసుకోండి
నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్ర.. కొంత దూరం పోయిన తర్వాత ప్రజలకు అర్ధం అవుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. అది యువగళమా లేక యువ గరళమా అన్నది త్వరలోనే ప్రజలకు తెలుస్తుందన్నారు. లోకేష్ మాత్రమే కాకుండా, చంద్రబాబు కూడా ఆ గరళం తాగుతాడు. ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఒళ్లంతా పుండవుతుంది. అదే లోకేష్ కు కూడా జరుగుతుందని సెటైర్లు వేశారు. గొడ్డొచ్చిన వేళ.. బిడ్డ వచ్చిన వేళ.. అన్న సామెత మాదిరిగా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడు.. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితం అయిందన్నారు. లోకేష్ ఒక బఫూన్, ఒక జోకర్.. ఆయనకు పర్సనాలిటీ, క్యారెక్టర్ రెండూ లేవు. అయినా ఆయనను రాష్ట్రం మీద రుద్దాలని లోకేష్ తల్లిదండ్రులు తాపత్రయ పడుతున్నారు. అందుకే లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా, ఆయన నాయకుడు కాలేడన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర సరుకు లేదు. నాయకుడు అనే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. పట్టుదల, చిత్తశుద్ధి ఉండాలి.. అవేవీ లోకేష్ కు లేవంటూ విమర్శలు చేశారు.
రాష్ట్రంలో ఇద్దరు బఫూన్లు తయారయ్యారు. ఒకరు చంద్రబాబు పుత్రుడు, మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. ఒకాయన పాదయాత్రతో వచ్చినా.. మరొకరు వారాహి మీద వచ్చినా అంతా హాస్యమే. పవన్ నోటికి అడ్డూ అదుపూ లేదు.. ఆఖరికి తన తండ్రి గురించి కూడా ఏదేదో మాట్లాడతాడు. ఇక లోకేష్ తన తండ్రి కంటే గొప్పవాడినని చెప్పుకుంటున్నాడు. ఇద్దరి మాటలు అచ్చం జోకర్ల మాదిరిగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. తన అర్హతలను ప్రశ్నిస్తున్నారని.. కానీ తాను మంత్రిగా ఎంతో సేవ చేశానని, రోడ్లు వేయించానని, చెట్లు నాటానని లోకేష్ ఏదేదో చెప్పాడు. మళ్లీ చెబుతున్నాం.. లోకేష్కు ఏ అర్హతా లేదు. కేవలం చంద్రబాబు కొడుకుగా ఎమ్మెల్సీ అయి, దొడ్డి దారిలో మంత్రి అయ్యాడన్నారు. కేవలం చంద్రబాబు తనయుడుగా తప్ప, లోకేష్ కు ఒక్కటైనా అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
చిరంజీవి, నాగబాబులు సమాధానం చెప్పాలి..
పవన్ తన పర్యటనల కోసం కొన్న వారాహి వాహనం గురించి కూడా లోకేష్ మాట్లాడాడు. అంటే ఇప్పటికే ప్యాకేజీ కుదిరిందా?. ఇక పవన్ కూడా దారుణంగా మాట్లాడుతున్నాడు. తన నానమ్మ దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే.. తన తండ్రి సిగరెట్ వెలిగించుకున్న హేతువాది అని అన్నాడు. ఆ విధంగా ఆయన తన తండ్రిని అవమానించాడన్నారు. అది నిజమో, అబద్ధమో చిరంజీవి లేదా నాగబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. భాష మీద పట్టు లేని వారు, చిత్తశుద్ధి లేని వారు, ఏం మాట్లాడుతున్నారో తెలియని వారు వీరంటూ దుయ్యబట్టారు.
టీడీపీకి సంస్కారం లేదు.. మీరే భోజనాలు ఏర్పాట్లు చేసుకోండంటూ పోలీసులకు తెలిపారు మంత్రి అంబటి. కుప్పం సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను ఉద్దేశించి చాలా దారుణంగా బూతులు మాట్లాడాడు. అది వారి పతనానికి నాంది. ఆశించిన స్థాయిలో ప్రజా సమీకరణ, ప్రజల్లో స్పందన లేకపోవడంతో తెలుగుదేశం నేతల్లో ఫ్రస్టేషన్ మొదలైందన్నారు. మరోవైపు అందరూ ఏకమై జగన్ ని ఓడిస్తామని అంటున్నారు. అవన్నీ పిచ్చి మాటలు. యువగళం పేరుతో వస్తున్న లోకేష్కు జనం తగిన బుద్ధి చెబుతారు. తమ భద్రత కోసం పని చేస్తున్న పోలీసుల గురించి టీడీపీ నేతలు అలా మాట్లాడడం దారుణమన్నారు. సిన్సియర్గా పని చేసే పోలీసులకు నాదొక విజ్ఞప్తి. యువగళం యాత్రలో డ్యూటీ చేస్తున్న పోలీసులు.. భోజన ఏర్పాట్లు సొంతంగా ఏర్పాటు చేసుకోండన్నారు.
జగన్ ఎదుట నిలబడలేరు..
రాష్ట్రంలో మూడున్నర ఏళ్లుగా చిత్తశుద్ధితో, పారదర్శకతతో అద్భుతమైన పరిపాలనను జగన్ అందిస్తున్నారు. అందుకే ఎంతమంది, కట్ట కట్టుకుని వచ్చినా ఆయన ఎదుట నిలబడలేరు. ప్రతి పథకాన్ని అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తున్నారు. అన్ని పథకాలు, కార్యక్రమాలు పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నారు. జనం గుండెల్లో జగన్ ఉన్నారు. మా ప్రయాణం ఎలాంటిది? మా పోరాటం ఎలాంటిది? ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం? మా నేతను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టినా, ఆయన భయపడలేదు.. వెనక్కు తగ్గలేదన్నారు. మా పార్టీ నుంచి 23 మందిని సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చంద్రబాబు చేశారు. ఎవరు పాదయాత్ర చేసినా, మరొకరు వారాహి మీద వచ్చినా మేము భయపడేది లేదన్నారు.
ఎందుకంటే మేము ప్రజల్లో ఉన్నాం.. వారి ఆదరాభిమానాలు పొందామన్నారు. పులి ఎవరో? నక్క ఎవరో? తెలుసు కదా?. పులి పోరాటం చేసి అధికారం చేపట్టింది. నక్క దాన్ని చూసి వాతలు పెట్టుకుంటుంది. ఒళ్లు పుండ్లు పడుతుంది తప్ప, మరేదీ ఒరగదన్నారు. చంద్రబాబు కూడా గతి తప్పారు. సీనియర్ నాయకుడు అయినా తనలో విశ్వాసం పోయిందన్నారు. అందుకే మాట్లాడితే తప్పులు దొర్లుతున్నాయని అన్నారు. సైకిల్ పోవాలి.. అని పిలుపునిస్తున్నాడు. మేము ఒక్కటే చెబుతున్నాం.. మీరందరూ కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? మా బలం చాలా ఎక్కువ అనే కదా? అది వాస్తవం. అంతిమ విజయం వైఎస్సార్ కాంగ్రెస్దే అంటూ స్పష్టం చేశారు మంత్రి అంబటి.