హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ ను ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్ నాథ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రేసింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను మెచ్చుకున్నారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఈ స్థాయికి చేరడానికి తెలంగాణతో పాటు తెలుగు ప్రజల కృషి కూడా ఉందన్నారు. విశాఖ పట్నంను కూడా హైదరాబాద్ నగరం తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఏపీలో కూడా ఇలాంటి రేసు నిర్వహిస్తారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ.. కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి.. గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చడానికి టైమ్ పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించే స్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అమర్ నాథ్.
కాగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ కారు రేసులో భాగంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించిన రేసు విజయవంతంగా ముగిసింది. ఈ రేసులో 11 టీమ్ లు 22 మంది డ్రైవర్లు పోటీపడగా.. జీన్ ఎరిక్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.
వీరికి మంత్రి కేటీఆర్ బహుమతులు అందజేశారు. ఈ రేసింగ్ ను చూసేందుకు పలువురు సెలబ్రిటీలు కూడా వచ్చారు. సుమారు 20 వేల మంది ప్రేక్షకులు ఈ రేస్ ను కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.