175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పొటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా? అంటూ ముఖ్యమంత్రి జగన్ సవాల్ విసిరారని వైసీపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ సవాలుకు సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు ముఖాలు చాటేస్తున్నారన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లోకి వెళ్లి మద్దతు ఇమ్మని అడుగుతున్నామని పేర్కొన్నారు.
వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయంతో పాటు, మాందోస్ తుపాను పంట నష్ట పరిహారం చెల్లించామని తెలిపారు. వైసీపీ నమ్ముకున్నది ప్రజలను మాత్రమే అని.. ప్యాకేజీలు చెల్లిస్తే కలిసే పార్టీ వైసీపీ కాదంటూ మంత్రి కాకాణి సెటైర్లు వేశారు.
యువగళం పాదయాత్రకు జనాధారణ లేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు ను ప్రజలు తిరస్కరించారని, ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. కేవలం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని మాత్రమే ప్రశ్నిస్తున్నామని తెలిపారు.
‘పవన్ కళ్యాణ్ ను, ఆయన పార్టీని తాము అసలు గుర్తించడం లేదన్నారు. పవన్ గురించి మాట్లాడితే మాకు అవమానం అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ మాత్రమే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.