జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు.
నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలపై ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల కారణంగా నామినేషన్ వేయనివారికి తిరిగి అవకాశం కల్పించాలని ఎస్. గుంటూరులోని మాచర్ల, కడపలోని పులివెందుల, రాయచోటి, చిత్తూరులోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో సింగిల్ నామినేషన్లపై అధికారులను రమేశ్ కుమార్ నివేదిక కోరారు. ఈనెల 20 లోపు పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బెదిరిస్తున్నారని రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఆ వార్డుల్లో నామినేషన్లు తీసుకోవాలని సూచించారు. బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.