విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ ఇక ప్రభుత్వంలో అంతర్భాగం కానుంది. సంస్థ సహా అందులో పనిచేస్తున్నఉద్యోగులను, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఏర్పాటు చేసిన కమిటీ సానుకూలంగా నివేదిక ఇస్తున్నట్టు సమాచారం. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. కమిటీ ఛైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి సహా కమిటీ సభ్యులు సీఎం జగన్ను కలిసి నివేదిక సమర్పిస్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై రెండున్నర నెలల పాటు తాము చేసిన అధ్యయనాన్ని, పలు మార్గదర్శకాలను ఈ నివేదికలో పొందుపర్చారు. విలీనంపై ఐదు రకాల ఉత్తమ విధానాలను ప్రాధాన్యాల వారీగా సిఫార్సు చేశారని తెలిసింది. డీజిల్ ధరలు పెరగడంతో సంస్థకు నష్టాలు వస్తున్నందున ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడంపైనా కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై వచ్చిన ఈ నివేదికను మంత్రివర్గ భేటీలో చర్చించి ప్రభుత్వం ఆమోదించనుంది.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఎర్ర బస్సు ఇక సర్కారుపరం