ముఖ్యమంత్రి కేసీఆర్ కు అహంకారం మితిమీరిపోయిందని విమర్శించారు బీజేపీ ఎంపీ అరవింద్. ఆయనకు మహిళలపై ఉన్న చిన్నచూపును గవర్నర్ తమిళిసైపై కూడా చూపించారని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే మనందరం నడుచుకోవాల్సి ఉంటుందని.. కానీ.. సీఎం మాత్రం సొంత రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
మొదటిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక తన కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు అరవింద్. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆరు నెలల పాటు కేబినెట్ విస్తరణే చేయలేదని గుర్తు చేశారు. చట్ట సభల నిర్వహణకు ప్రత్యేక రూల్స్ ఉంటాయని.. వాటన్నింటినీ కేసీఆర్ తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 9వ అసెంబ్లీ సెషన్స్ ను ప్రారంభిస్తున్నారని… పైగా అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదు కాబట్టి ఈ సెషన్స్ కూడా 8వ సమావేశాల్లాగే పరిగణిస్తారని చెప్పడం మూర్ఖత్వంగా అనిపిస్తోందని అన్నారు అరవింద్. ఆర్టికల్ 176 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాతనే కొత్త బడ్జెట్ సంవత్సరంలో సెషన్స్ ప్రారంభం కావాలని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నారు కాబట్టి ఈ రూల్స్ ఏవీ ఆయన పాటించడం లేదని విమర్శించారు.
“తాను ఒక రాజును, తెలంగాణ ఒక రాజ్యం అనుకుంటున్నారు. అందుకే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు ఫాలో కావాలి. నేనే ప్రత్యేక రాజ్యాంగం రాసుకుంటా అని అంటున్నారు. ప్రకాశ్ రాజ్, కేసీఆర్ దోస్తానా చూస్తుంటేనే వాళ్ల ఉద్దేశం అర్థం అవుతోంది. దేశం ముక్కలు కావాలి అన్న భావజాలం ఉన్న జిగ్నేష్ మేవానీ బృందాన్ని ముందు నుంచి ప్రకాశ్ రాజ్ సమర్ధిస్తున్నాడు. కేసీఆర్ కూడా భారతదేశం ఐక్యంగా కాకుండా చిన్న చిన్న రాజ్యాలుగా మారాలని కోరుకుంటున్నారేమో. అందుకే వీళ్లిద్దరు కలిసి దేశమంతా తిరిగి ప్రాంతీయ పార్టీల నేతలతో మీటింగ్ లు పెడుతున్నారు. దేశాన్ని ముక్కలు చేయడమే వీళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న గవర్నర్ నే గుర్తించనప్పుడు.. సీఎంకు ఆ సీటులో ఒక్క నిమిషం కూడా కూర్చునే అర్హత లేదు. కేసీఆర్ అహంకారానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. త్వరలో ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం” అంటూ విమర్శలు చేశారు అరవింద్.