కల్తీ..కల్తీ.. ఎక్కడ చూసినా కల్తీయే..కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఇక పాల కల్తీ అయితే కల్తీరాయుళ్లకు కాసుల వర్షాన్ని కురిస్తుంది. అందుకే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ తాగే పాలను కూడా కంత్రీగాళ్లు కల్తీగా మారుస్తున్నారు. దాన్ని ఒక కుటీర పరిశ్రమగా మార్చేసుకుంటున్నారు.
తాజాగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బీ యన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎరుకల భాస్కర్, ఎరుకల బాలనర్సయ్య,నకిరేకంటి రాజు కలిసి కల్తీ పాల వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఈ దందా చాలా కాలం నుంచి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంది. అయితే సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కల్తీ పాలను తయారు చేయడం కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ లో పాల పౌడర్ ను కలుపుతున్నారు. దీంతో పాటు హైడ్రో క్లోరిక్ యాసిడ్ ను మిక్స్ చేస్తున్నారు. ఈ పద్ధతిలో రెగ్యులర్ గా పాలు తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక సమాచారం అందుకున్న ఎస్ వోటీ ఇంకా భువనగిరి రూరల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పాల తయారీ కేంద్రంపై దాడి చేశారు.
ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర్నుంచి 120 లీటర్ల కల్తీ పాలు, డాల్ఫర్ ఫ్రెష్ మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ,హైడ్రో క్లోరిక్ యాసిడ్, మిక్సింగ్ రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎలాంటి వారి పై.. అయినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.