బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పలు రికార్డులు బద్దలు కాబోతున్నాయి. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అనేక రికార్డులు ఊరిస్తుండగా.. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కూడా ఓ అరుదైన రికార్డును అందుకునేందుకు తహతహలాడుతున్నాడు.
అతను ఏకంగా భారత స్పిన్ దిగ్గజాలుగా పేరొందిన కుంబ్లే.. హర్భజన్ సింగ్ ల రికార్డులను బద్దలు కొట్టాలని భావిస్తున్నాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అశ్విన్ కు తిరుగులేని రికార్డు ఉంది. అశ్విన్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై 18 టెస్టులాడి 89 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ పై అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు.
అశ్విన్ కంటే ముందు 111 వికెట్లతో కుంబ్లే టాప్ వన్ లో ఉండగా.. 95 వికెట్లతో హర్భజన్ రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో ఈ నాలుగు టెస్టుల్లో అశ్విన్ మరో ఏడు వికెట్లు సాధిస్తే ఆస్ట్రేలియా పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా నిలుస్తాడు. ఒక వేళ ఈ సిరీస్ లో 22 వికెట్లు పడగొడితే అశ్విన్, కుంబ్లే రికార్డును బద్ధలు కొట్టే అవకాశం ఉంది.
రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్ లో ఇప్పటి వరకు 88 టెస్టులు ఆడాడు. అందులో 449 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా టెస్టుల్లో 30 సార్లు 5 వికెట్లు, 7 సార్లు 10 వికెట్ల మార్కును అందుకున్నాడు.