ఉన్న దేశంలో తినడానికి తిండి లేకపోవడంతో పొట్ట చేత పట్టుకొని ఇతర దేశాలకు వలస వెళ్దామనుకున్న శరణార్ధులను అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాలకు గురవుతుండడం తెలిసిందే.
తాజాగా, ఇటలీ తీరంలో విషాద ఘటన జరిగింది. శరణార్థులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో 34 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో ఓ పసికందు కూడా ఉండడం స్థానిక అధికారులను కలచివేసింది.
ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి.
అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు.