రోడ్డుపై కుప్పలుతెప్పలుగా ఆధార్, ఏటీఎం కార్డులు పడి ఉన్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జడ్చర్ల-తిమ్మాజి పేట రహదారిలో నాగసాల చెరువు సమీపంలో కట్టలు, కట్టలుగా ఆధార్, ఏటీఎం కార్డులు ఉండడాన్ని కొందరు స్థానికులు గమనించారు.
ఎంతో విలువైన ఆధార్ కార్డులు ఇలా బహిరంగ ప్రదేశంలో పడేయడం వల్ల.. అవి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి చేతికి చేరితే భారీ నష్టం తప్పదంటున్నారు. దీంతో ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవానలి స్థానికులు కోరుతున్నారు.
వెంటనే రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది వాటిని పరిశీలించారు. పోస్టుల ద్వారా వినియోగదారులకు చేరాల్సిన విలువైన ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులతో పాటు పలు కవర్లు ఉన్నట్టు గుర్తించారు.
అనంతరం వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేసి, ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు.