ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ భూవివాదం విషయంలో మహిళా న్యాయవాదిపై కొంతమంది మహిళలు దాడి చేశారు. రోడ్డుపై జుట్టు పట్టుకొని భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈఘటన ఖమ్మం ప్రెస్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని మాదిరాజు వెంకటేశ్వరరావు పేరు మీద కొంత భూమి ఉండగా.. కొంత కాలంగా దానిపై వివాదం నడుస్తోంది. అయితే.. ఈ భూమిని హైదరాబాద్ కు చెందిన యాకుబ్ పాషా కొనుగోలు చేశారు. ఆయన తన లాయర్ పుష్పలతతో కలిసి ఖమ్మం ప్రెస్క్లబ్ వద్దకు చేరుకున్నారు.
ఇంతలో అక్కడికి చేరుకున్న కొంత మంది మహిళలు.. ఆ భూమి తమకు సంబంధించిందని గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా న్యాయవాది పుష్పలతపై దాడి చేశారు. ఆమెపై దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయవాదిని రక్షించారు. ఆ భూమి తమదని హైదరాబాద్కు చెందిన వ్యక్తి చెప్తుండగా.. నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమి మీదకు వచ్చారంటూ మహిళలు ఆరోపిస్తున్నారు. పోలీసుల ఎంట్రీతో వివాదం సద్దుమణిగింది.