వామనరావు దంపతుల హత్య ఎంత సంచలనం అయిందో చూశాం. టీఆర్ఎస్ నేత నడిరోడ్డుపై హైకోర్టు న్యాయవాదులను చంపేసిన ఆ ఘటన జరిగి ఏడాది అయినా.. ఇప్పటికీ మంథని ప్రజలు మర్చిపోలేదు. ఈ కేసులో అసలైన నిందితులు తప్పించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే.. గులాబీల రాజ్యంలో మరో లాయర్ పై దాడి జరిగింది.
మల్కాజిగిరి కోర్టులో ప్రసన్న అనే లాయర్ పై మరో న్యాయవాది శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు. ప్రసన్న బీజేపీ తరఫున నేరేడ్ మెట్ కార్పొరేటర్ గా పోటీ చేశారు. ఇటు శ్రీనివాస్ న్యాయవాదిగా చేస్తూ టీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడని చెబుతున్నారు.
కోర్టు ప్రాంగణంలోనే దాడికి పాల్పడ్డాడు శ్రీనివాస్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కారణంగానే ఎటాక్ చేసినట్లుగా బాధితురాలు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కంటి భాగం దగ్గర బాగా గాయాలయ్యాయి.
చాలా రోజుల నుంచి తనను వేధిస్తున్నారని.. పోలీసులను ఆశ్రయించినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు ప్రసన్న. టీఆర్ఎస్ జోలికొస్తావా అంటూ బెదిరింపులకు పాల్పడేవాడని.. తన గురించి అసభ్యంగా ప్రచారం చేసేవాడని కన్నీళ్లు పెట్టుకున్నారు.