మాదాపూర్ లోని పలు పబ్బుల్లో నిబంధనలను పాటించటం లేదన్న సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు దాడులకు దిగారు. నిన్న రాత్రి మొత్తం 16 పబ్బులపై దాడులు జరిపినట్లు తెలిపారు. హార్డ్ కప్, బాక్స్ పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
పబ్బులపై ఆకస్మిక పోలీసుల తనిఖీల్లో విస్తు పోయే విషయాలు బయటపడ్డాయి. దీంతో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న నలుగురిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్డ్ బాక్స్ పబ్బుకు లైసెన్స్ లేదని గుర్తించినట్లు ఎస్వోటీ అధికారి వెల్లడించారు.
ఈ క్రమంలో హార్డ్ కప్ పబ్బు యజమాని ఎం.పవన్ కుమార్, మేనేజర్ ఆదిత్య తమంగ్ ను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బర్డ్ బాక్స్ పబ్బు యజమాని వంశీవర్ధన్, మేనేజర్ అర్జున్ ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బుల గురించి తెలిస్తే 94906 17444 నెంబర్ కు వాట్సాప్ ద్వారా వివరాలు తెలియజేయాలని డీసీపీ కోరారు. అంతే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఫాంహౌస్ లపై కూడా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.