టీ20 వరల్డ్ కప్ కు ఉండే క్రేజే వేరు. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మరో మెగా సమరానికి క్రికెట్ ప్రపంచం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీ జరగబోతుంది. కరోనా కారణంగా మధ్యలో వరల్డ్ కప్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్ లను చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు శుక్రవారం వెల్లడించింది.
ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా సహా ఇప్పటికే కొన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లతో అక్కడ క్రికెట్ సందడి నెలకొంది.ఈ నెల 16న టీ20 వరల్డ్ కప్ మొదలవనుంది. మొదటగా గ్రూప్ స్టేజ్ మ్యాచులు జరుగుతాయి. గ్రూప్ స్టేజ్ లో శ్రీలంక, నమీబియా, UAE, వెస్టిండీస్, నెదర్లాండ్స్ , స్కాట్లాండ్ , జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు పోటీ పడతాయి.
అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 రౌండ్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది. సూపర్ 12లో భాగంగా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడనున్నాయి. మెల్ బోర్న్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి 90 వేల టికెట్లు విక్రయించినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇవే కాదు.. మిగతా మ్యాచుల టికెట్లన్నీ భారీగానే అమ్ముడయిపోయాయి. గీలాంగ్లోని 36 వేల కెపాసిటీ గల కార్డినియా పార్క్ స్టేడియంలో శ్రీలంక నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది.