రాష్ట్రంలో రోజుకో చోట డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా స్మగ్లర్లు మాత్రం మానడం లేదు. ఈ డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు దర్యాప్తు సంస్థలు ముందడుగులు వేస్తున్నాయి. డిమాండే సరఫరాకు మూలం అనే సూత్రం ఆధారంగా వ్యూహరచన చేస్తున్నాయి. డ్రగ్స్ ఎక్కువగా వాడకం జరిగే ప్రాంతాలకు స్మగ్లర్లు రిస్క్ తీసుకొని మరీ.. మత్తు పదార్ధాలు చేరవేస్తున్నారనే కోణంలో సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాయి.
అసలు డిమాండే లేకుండా చేయగలిగితే స్మగ్లర్లను కట్టడి చేసేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో వినియోగానికి అందుబాటులో ఉన్న హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు అధికారలు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, ఆటోస్టాండ్లు, విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు.. లాంటి హాట్ స్పాట్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు నిర్ణయించారు.
ఇటు రాష్ట్రంలో డ్రగ్స్ వాడకాలు భారీగా పెరిగాయని అధికారులు చెప్తున్నారు. అయితే 70 నుండి 80శాతం వరకు గంజాయి వాడకం జరుగుతోందని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యువత, విద్యార్థులు ఎక్కువగా గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. కానీ.. వ్యాపారవర్గాలు, సినీప్రముఖులు మాత్రం కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ లాంటి నార్కొటిక్స్ డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్టు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఇప్పటివరకు మాదకద్రవ్యాల్ని సరఫరా చేసే ముఠాలపైనే కఠిన చట్టాలు ప్రయోగిస్తున్న దర్యాప్తు సంస్థలు.. వినియోగదారులను సైతం బాధితులుగానే గుర్తించాలని నిర్ణయించాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ ఇదే కారణంతో సినీప్రముఖులు గండం నుంచి గట్టెక్కారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ సెల్ ఫోన్లకు పలువురు సినీ ప్రముఖులు వాట్సప్ ద్వారా చేసిన చాటింగ్ లు.. నగదు లావాదేవీలను ఎక్సైజ్ వర్గాలు గుర్తించాయి. కానీ.. వీరిని బాధిత వర్గంగా పరిగణించి వదిలేశాయి. ఇలాంటి వినియోగం విషయంలో ఇకపై కొంత కఠినంగా వ్యవహరించనున్నారు అధికారులు