హాలీవుడ్ అద్భుత చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన దృశ్య కావ్యం అవతార్. దాదాపు 13 యేళ్ళ కిందట వచ్చిన ఈ చిత్రం సినీప్రియుల్ని కదిలించింది. మనిషి స్వార్థం ఎంత విధ్వంశాని పాల్పడుతుందోనని ఆలోచింపజేసింది.జేమ్స్ కెమెరూన్ మేధస్సుకి, ఇమేజినరీ కేపబిలిటీకి ప్రపంచమంతా బ్రహ్మరథం పట్టింది.దాదాపుగా అదే కథాంశానికి కొనసాగింపుగా వచ్చిన అవతార్ -2 కూడా ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. విజువల్ వండర్ గా ‘అవతార్-2’ భారత్లో రికార్డులు సృష్టిస్తోంది.
అవతార్లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు కామెరూన్. ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్'(అవతార్-2) ప్రస్తుతం అన్ని రికార్డులను తిరగరాసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ను రాబట్టింది.
కాగా, ‘అవతార్-2’.. భారత్లో రూ.368.20 కోట్ల వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. అంతకుముందు ‘ఎవెంజర్స్: ది ఎండ్గేమ్’ రూ.367 కోట్లు వసూళ్లు సాధించగా ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు.
అవతార్-2 కేవలం 14 రోజుల్లోనే బాక్సాఫీస్ 1 బిలియన్ యూఎస్ డాలర్ల మార్కును దాటింది. 2022లో విడుదలైన ‘టాప్ గన్: మావెరిక్’,’జురాసిక్ వరల్డ్ డొమినియన్’ సరసన నిలిచింది అవతార్-2. దీంతో 2022లో విడుదలైన ఇతర సినిమాల కంటే జేమ్స్ కామెరూన్ చిత్రం ఈ మైలురాయిని వేగంగా అధిగమించి రికార్డు సృష్టించింది.