ఆయుష్మాన్ భారత్.. ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ స్కీం అని, ఈ పథకం ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తూ వరుస ట్వీట్లు చేశారు. మారుతున్న కాలానుగుణంగా వైద్యరంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. దేశంలో అందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ చౌకైన ఆరోగ్య సేవలు పేద, మధ్యతరగతి ప్రజల పొదుపును పెంచాయని తెలిపారు.
आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम्॥
Greetings on World Health Day. May everyone be blessed with good health and wellness. Today is also a day to express gratitude to all those associated with the health sector. It is their hardwork that has kept our planet protected.
— Narendra Modi (@narendramodi) April 7, 2022
Advertisements
అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా మంచి వైద్యం చేయించుకునేలా దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ నెట్వర్క్ను మరింత విస్తృతం చేస్తున్నామన్నారు. గత 8 ఏళ్లలో వైద్య, విద్యారంగంలో వేగంగా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా అనేక మెడికల్ కాలేజీలు వచ్చాయని, స్థానిక భాషల్లో వైద్య విద్యను అందుబాటులోకి తేవడం ద్వారా భారీ సంఖ్యలో యువతను వైద్య రంగం వైపు మళ్లించవచ్చని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
దేశంలోని ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రపంచాన్ని వణికించిన కరోనా మమ్మారి నియంత్రణలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు ట్వీట్లు చేశారు.
కాగా, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థను స్థాపించింది. ప్రపంచ దేశాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి పరస్పర సహకారం, ప్రమాణాలను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రపంచంలోని చాలా దేశాలు సభ్యులుగా ఉన్నాయి.