విజయవాడ: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తీవ్ర వత్తిళ్ళను ఎదుర్కొంటున్నారు. ఓవైపు పార్టీకి చెందిన సీనియర్లు ఒక్కరొక్కరుగా వెళ్లి పోతుండగా, మరోవైపు అధికారంలో వున్న వైసీపీ ఇదే అదనుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేస్తోంది. అంతే కాకుండా ఎవరైతే టీడీపీ అధినేతకు కుడి భుజంగా వున్నారో వారి ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతోంది. ఏపీలో ఎక్కడ తెలుగుదేశం బలంగా వున్నదో, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తమ జెండా ఎగరాలని పావులు కదుపుతోంది. ప్రతి చోటా దాడులు అధికమయ్యాయి. కొన్ని చోట్ల హత్యలు చోటు చేసుకున్నాయి. ఇక ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరద ఉధృతి పెరిగింది. గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది.
వరద తాకిడికి పలు గ్రామాలు నీట మునిగాయి. కానీ ప్రభుత్వం సహాయక చర్యల్లో కొంచెం ఆలశ్యం చేసింది. దీనిని కూడా రాజకీయం చేయాలని చూసింది. బాబును టార్గెట్గా చేశారే తప్ప, సమస్య తీవ్రం కాకుండా చూడలేకపోయారు. ఏపీ అంతటా తెలుగుదేశం శ్రేణులపై దాడులు పెరిగిపోయాయి. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కేసులు, దాడులు ఉండవని చెప్పిన జగన్ మరుసటి రోజు నుంచే ప్రతి దాడులు పెరిగిపోయాయి. బాధితులకు భరోసా నింపేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వైసీపీ కావాలని దాడులకు పాల్పడుతోందని, దీన్నిచూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అయినా జగన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తాను ఏది చేసినా నడుస్తుందనే ధోరణితో ఇటు తెలంగాణలో అటు ఏపీలో కొనసాగుతున్నది.
రెండు రాష్ట్రాలలో టీఆర్ఎస్, వైసీపీలకు భారీ మెజారిటీ వచ్చింది. దీంతో వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. ఇక్కడ పోలీస్, దొర పాలన నడుస్తుంటే అక్కడ రాయలసీమ మార్క్ పాలిటిక్స్కు తెరతీశారు. పల్నాడును రక్షించు కోవాలని కోరుతూ చంద్రబాబు ఛలో ఆత్మకూరు పేరుతో పిలుపునిచ్చారు. వైసీపీ బాధితులంతా తరలి రావాలని కోరారు. 100 రోజుల అరాచక పాలన గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఆర్ధిక మూలాలను దెబ్బ కొడుతున్నారు. ఖాకీలను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాస నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం మీద జగన్.. చంద్రబాబు మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిందన్నమాట!