బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై సొంత పార్టీలోనే అసమ్మతి రగులుతోంది. సంజయ్ పై పార్టీ సీనియర్ నేత కన్నం అంజయ్య సంచలన కామెంట్స్ చేశారు. దళితులపై సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. దళితులకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
దేశం కోసం ధర్మం కోసం కష్టపడుతున్న కార్యకర్తలను మెచ్చుకోవడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కోరు కమిటీలో దళితులకు పదవులు ఇవ్వడంపై చర్చించడాన్ని గుర్తు చేసిన అంజయ్య… బీసీ నాయకుడిగా ఉండి, దళితులకు పదవులు ఇవ్వకుండా ఉండటమేంటని నిలదీశారు.
బీజేపీలో మా స్థానం ఏంటని కార్యకర్తలు అడుగుతున్నారని, ఏమని చెప్పాలని ప్రశ్నించారు. ఆర్థికంగా సపోర్ట్ చేసే వాళ్లకే బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని బండి సంజయ్ పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు.
నిన్నమొన్న వచ్చని వారు జాతీయ నాయకులవుతారని, ఏళ్లుగా పార్టీ కోసం సేవలు అందించిన వారు అలాగే ఉండిపోతున్నారని వ్యాఖ్యానించారు అంజయ్య. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు చనిపోతే వాళ్లింటికి వెళ్లి ఓదార్చలేని అధ్యక్షుడివి ఇంకేం భరోసా ఇస్తావు.. అంటూ బండి సంజయ్ పై సంచలన కామెంట్స్ చేశారు అంజయ్య.
ఇంతటితో ఆగని అంజయ్య కరీంనగర్ లో వ్యతిరేక ఆత్మీయ సమ్మేళనం పెడతామని ప్రకటించారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ఎంత మంది దళితులకు పదవులు ఇచ్చావో తెలుసుకుందాం అంటూ ఆయన సవాల్ విసిరారు. ఏ జిల్లాకు దళితున్ని జిల్లా అధ్యక్షులు చేయలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేయమన్నందుకు బండి సంజయ్ తనపై కక్ష పెంచుకున్నాడని అంజయ్య ఆరోపించారు.