తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో అన్న నందమూరి తారక రామారావు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా.. రాజకీయ వేదిక అయినా.. అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు.
ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లైనా ఆ మహానుభావుడు తెలుగు జాతిపై చేసిన సంతకం చెక్కుచెదరనిది. ఈ ఏడాది మే 28 నుండి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అన్నగారి శత జయంతి వేడుకలు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభంకానున్నాయి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టిన ఊరు నిమ్మకూరులో ఈ వేడుకలు మే 28న ఉదయం బాలకృష్ణ చేతుల మీదుగా అత్యంత ఘనంగా మొదలవుతాయి. అలాగే మధ్యాహ్నం గుంటూరు లోను, సాయంత్రం తెనాలిలోనూ ఈ శత జయంతి సందర్భంగా ఏడాది పొడవునా జరగనున్న కార్యక్రమాలను సైతం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
వీటికి సంబంధించిన ఏర్పాట్లు భారీగానే జరగనున్నాయి. అన్నగారి శత జయంతి వేడుకలు అంటే.. 10 కోట్ల మంది తెలుగు వారికి ప్రతి ఇంటి పండగ. ఈ వేడుకలకు అభిమానులు సైతం భారీగా హాజరు కాబోతున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.