చైనా సీసీటీవీ కెమెరాలను బ్యాన్ చేయాలని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ప్రధాని మోడీని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి ఏర్పాటును నిషేధించాలని, అలాగే ఇళ్లలో వీటిని వినియోగించకుండా ప్రజల్లో చైతన్యం తేవాలని నినాంగ్ ఎరింగ్ అనే ఈ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. చైనాలో తయారైన సీసీటీవీ కెమెరాలను ఇండియాలో వినియోగిస్తున్నారని, కానీ ఇవి చైనా గూఢచర్యానికే ఉపయోగపడుతున్నాయని మాజీ మంత్రి కూడా అయిన నినాంగ్ పేర్కొన్నారు.
ఇవి దేశ భద్రతకు పెను ముప్పు అన్నారు. ప్రస్తుతమున్న మన భారతీయ చట్టాలు వీటి నివారణకు చాలవని ఆయన అభిప్రాయపడ్డారు. భారత వ్యతిరేక శక్తులకు ఈ కెమెరాలు కళ్ళు, చెవులుగా ఉపయోగపడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సరిహద్దుల్లో చైనా చొరబాట్లకు యత్నిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆ దేశ హ్యాకర్లు భారత వ్యవస్థలపై దాడులకు పాల్పడుతున్నారని అమెరికాలోని ఓ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ కెమెరాలను, డిజిటల్ వీడియో రికార్డింగ్ డివైజ్ లను చైనా హ్యాకర్లు తమ స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారన్నారు
ఇండియాలో దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, వీటిలో 90 శాతం కెమెరాలు చైనా కంపెనీలు తయారు చేసినవేనన్నారు. ముఖ్యంగా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేశారని నినాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు.