శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు ఇవాళ నామినేషన్ వేయాల్సిందిగా ఆయనకు సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని పార్టీ నాయకులకు కేసీఆర్ చెప్పారు.
ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ ఛైర్మన్ ను సభ్యులు ఎన్నుకోనున్నారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని చెబుతున్నారు.మండలి డిఫ్యూటీ ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్ రావు పదవి కాలం పూర్తయినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. బండా ప్రకాశ్ 2021 లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు.
వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాశ్ 1981 నుంచి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ నుంచి రాజ్యసభ ఎంపీ దాకా పని చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బండా ప్రకాష్ 2018 మార్చిలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అయితే ఎంపీగా ఆరేండ్ల పదవీకాలం పూర్తికాక ముందే 2021 నవంబర్ లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. తరువాత అదే ఏడాది డిసెంబర్లో రాజసభ్య సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇలా రాజీనామా చేసినందుకే ఇప్పుడు ప్రకాశ్ కు మండలి డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.