– కేంద్రం అవినీతి చేసిందా?
– దమ్ముంటే వారం రోజుల్లో నిరూపించు..
– బహిరంగ క్షమాపణ చెబుతా..
– లేకపోతే.. ముక్కు నేలకు రాసి సారీ చెప్తావా?
– కేసీఆర్ కు బండి సవాల్
– ఉఫ్ అంటావా? నువ్వు.. నీ పార్టీ గింత..
– మాది ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీ
– తట్టుకోలేవ్.. మాడి మసైపోతావ్..
– బహిరంగ సభల్లో డ్రంకన్ డ్రైవ్ చేస్తాం..
– తాగినట్లు తేలితే.. జైలుకు పంపుతాం
– సీఎం వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్స్
రాయగిరి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పెద్దపల్లి జిల్లా వెంకట్రావుపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరగబోతోందని.. తన పని ఖతమైందని గ్రహించి తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయ లబ్ది పొందే కుట్రకు తెరతీశారని అన్నారు. అందులో భాగంగానే నరేంద్ర మోడీపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ సమాజమంతా అసహ్యించుకుంటోందని.. దీనిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారన్న బండి… తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని.. అడ్డగోలుగా బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పెట్టడం తప్పని ఇప్పుడు కేసీఆర్ చెప్పడానికి సిగ్గుండాలని.. ఆనాడు ప్రధాని నిర్ణయం స్పూర్తిదాయకమని పొగిడింది మర్చిపోయావా? అంటూ మండిపడ్డారు. కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచమంతా ప్రశంసిస్తే.. కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమై పారాసిటమాల్ సీఎంగా విమర్శల పాలయ్యారని గుర్తు చేశారు.
మోడీ వద్దకు పోయి వంగి వంగి దండాలు పెట్టడం.. ఇక్కడికొచ్చి తిట్టడం కేసీఆర్ కు అలవాటైందన్నారు బండి. కేసీఆర్ చెల్లని రూపాయి.. రైతు చట్టాలను పొగిడి.. ఇప్పుడు విమర్శిస్తుండటం సిగ్గుచేటని చెప్పారు. వ్యవసాయ బోర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఏనాడైనా చెప్పిందా? దమ్ముంటే.. చిత్తుశుద్ధి ఉంటే.. కేసీఆర్ లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. కేంద్రం ఎప్పుడైనా బోర్లకు మీటర్లు పెట్టాలని చెప్పినట్లుగా నిరూపిస్తే తాను ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ప్రకటించారు. నిరూపించకపోతే.. కేసీఆర్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
డిస్కంలకు రూ.48 వేల కోట్లు బాకీ ఎందుకు పెట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సంజయ్. కాంగ్రెస్-టీఆర్ఎస్ చీకటి ఒప్పందం బయటపడిందని.. సభలో కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడటమే అందుకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ లోనూ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి టీఆర్ఎస్ సభ్యులకు పదేపదే సపోర్ట్ చేస్తున్నారని వివరించారు. తెలంగాణలో మత పిచ్చి లేపుతోందే కేసీఆర్ అని.. కర్నాటకలోని హిజాబ్ వివాదాన్ని లేవనెత్తి మత కల్లోలానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో అరిగోస పడుతున్నారని అన్నారు సంజయ్. కేంద్రం అవినీతికి పాల్పడుతోందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి నిరూపించాలని సవాల్ చేశారు. వారం రోజుల్లో కేంద్రం అవినీతి చిట్టా బయటపెడతావా? బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని కేసీఆర్ ను సూటి ప్రశ్న వేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహారా, ఈఎస్ఐ స్కాంలో మొదటి ముద్దాయి కేసీఆరేనని.. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ.. తాను చేసిన వ్యాఖ్యలను దారి మళ్లించేందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలారా.. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్న టీఆర్ఎస్ కావాలా? అంబేద్కర్ రాజ్యాంగంతో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ కావాలా? తేల్చుకోండని సూచించారు బండి సంజయ్.
జనగామ పర్యటనలోనూ కేంద్రంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు సంజయ్. సీఎంకు ఫ్ట్రస్ట్రేషన్ ఎక్కువైందని.. ఏం మాట్లాడుతున్నరో అర్ధం కావడం లేదన్నారు. ఆయనో చెల్లని రూపాయి.. ఎవరూ దేకడం లేదని మండిపడ్డారు. సభలో రాజ్యాంగాన్ని తిరగరాస్తానన్న వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెబుతారేమో.. బుద్ధి వచ్చిందేమో అనుకున్నామని… కానీ అందుకు భిన్నంగా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పడానికే సభ పెట్టినట్లుందని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.
కేసీఆర్.. ఉఫ్ అని అంటావా? నీది గింత పార్టీ.. ప్రపంచంలోనే నెంబర్ వన్ పార్టీ బీజేపీ.. మాడి మసైపోతావ్ అంటూ మండిపడ్డారు బండి. బహిరంగ సభలో డ్రంకన్ డ్రైవ్ చేస్తామని… తాగినట్లు తేలితే జైలుకు పంపతామని సెటైర్లు వేశారు. ఈ స్కీం కేసీఆర్ కోసం కచ్చితంగా తీసుకొస్తామని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను నశం పెట్టి కొడుతామని హెచ్చరిస్తారా.. కేసీఆర్ నశం పెడితే మేము జండూబాం పెడుతామని కౌంటర్ ఇచ్చారు. సీఎం సభకు రెండ్రోజుల ముందు నుండే కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారని.. పోలీసుల సమక్షంలో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
లాఠీలకు, దాడులకు భయపడకుండా బయటకొచ్చి భారతమాతాకీ జై అంటూ జెండా పట్టుకుని వస్తున్న కార్యకర్తలను చూసి కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని అన్నారు. తెలంగాణలో ఇలాగే కొనసాగితే.. నిజాం పాలన మాదిరిగా కేసీఆర్ వస్తుంటే చెప్పులు చేతుల్లో పట్టుకుని వంగి వంగి దండాలు పెట్టాలేమోనని విమర్శించారు. ‘సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలి.. డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి. కానీ నువ్వు చేసిందేమీ లేక.. బీజేపీని టార్గెట్ చేయడానికే సభ పెట్టినట్లుంది. సీఎం సోయి లేకుండా మాట్లాడిండు.. సోడాలో మందు పోసినట్లు మాట్లాడుతుండు.. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది. అవినీతి సామ్రాజ్యం కూలిపోతోంది. విచారణ స్టార్ట్ అయ్యిందని ఆయనకు తెలిసిపోయింది. అందుకే తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తుండు’ అంటూ విమర్శించారు.
జైలుకు పోకుండా అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు సంజయ్. మోడీ మాటల్లో తప్పులేదు కాబట్టే సభలో మాట్లాడలేకపోయారని.. బోర్లకు కరెంటు మీటర్లు పెడతానని కేంద్రం చెప్పిందా? అని నిలదీశారు. కేసీఆర్ వన్నీ అబద్దాలేనని.. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే చెప్పినా జనం నమ్మ లేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ అబద్దాలే చెప్పారని గుర్తు చేశారు. ‘నేనడుగుతున్నా.. మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా? దమ్ముంటే చూపించు.. ఈరోజు డిస్కంలకు రూ.48 వేల కోట్ల అప్పులిచ్చిండు. అవి కట్టకపోతే భవిష్యత్తులో తెలంగాణ చీకటి మయమవుతుంది. రైతులకు ఉచిత కరెంట్ ఆగే ప్రమాదం. పెట్రోల్ పై ధరలను కేంద్రం తగ్గిస్తే.. నువ్వేం చేసినవ్. నయా పైసా తగ్గించలే. 22 రాష్ట్రాలు తగ్గించినా నువ్వు మాత్రం లీటర్ కు రూ.40 లు దొబ్బిపోతున్నవ్. హుజూరాబాద్ లో నిన్ను చిత్తుగా ఓడించినా బుద్ది రాలేదు. తెలంగాణ ధనిక రాష్ట్రమే కదా.. ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించడం లేదు? నీ దరిద్రపు పాలనలో తెలంగాణను అప్పుల పాల్జేసినవ్. ఏనాడైనా సక్రమంగా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నవా? జీతాలివ్వలేకనే కదా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నవ్?’ అంటూ విమర్శలు చేశారు.
రాబందు నోట మళ్లీ దళితబంధు మాట వచ్చిందన్నారు బండి. హుజూరాబాద్ లో 20 వేల కుటుంబాలకు రూ.10 లక్షలు వేసేశామని చెప్పారు.. ఏమైందని ప్రశ్నించారు. అందరి ఖాతాల్లో డబ్బులు వేశావా? దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే లబ్దిదారుల జాబితాతో పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పేరుతో కన్ ఫ్యూజ్ చేయడానికే తప్ప ఏ ఒక్కరికీ లబ్ది చేకూరలేదని అన్నారు. ఎవరో ఒకరిద్దరికి డబుల్ బెడ్రూం, దళిత బంధు పథకాలు ఇవ్వడం.. ఆ ఆశ చూపి ఓట్లు దండుకోవడం కేసీఆర్ కు బాగా అలవాటైందని విమర్శించారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడతావా.. మోడీని చూస్తేనే వణుకుపుడుతుంది.. వెళ్లి వంగి వంగి దండాలు పెడతావు.. సిగ్గుండాలి అలా మాట్లాడటానికి అంటూ మండిపడ్డారు. ‘బలిదానాలు చేసిన పార్టీ అంట.. సిగ్గులేదు.. టీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు బలిదానం చేసిండో చెప్పే దమ్ముందా? నీ కేబినెట్ లో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్లు ఎందరున్నారో చెప్పే దమ్ముందా? తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వాళ్లు, త్యాగాలు చేసిన వాళ్లంతా నీ కుట్రలకు బలైపోయిండ్రు. తెరమరుగైపోయిండ్రు. ప్రొఫెసర్ జయశంకర్ ను కూడా అవమానించిన చరిత్ర నీది’ అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు బండి.
‘బలిదానాలు చేసిన పార్టీ బీజేపీ. 370 ఆర్టికల్ రద్దు కోసం శ్యామ్ ప్రసాద్ బలిదానం చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం, దేశం కోసం బలిదానం చేసిన పార్టీ మాది. నక్సల్స్ చంపుతామని హెచ్చరించినా.. చనిపోయే సందర్భంలోనూ పారిపోకుండా భారత్ మాతాకీ జై అని నినదిస్తూ శ్వాస వదిలిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది. కేసీఆర్ ను ఇక్కడే ఎవడు దేకడం లేదు… డబ్బులు సంచులు పంపినా ఎవడూ పట్టించుకోవడం లేదు. తమిళనాడు, ఒడిశా, బెంగాల్ పోయి గుళ్లు గోపురాలు తిరిగి వచ్చిండే తప్ప ఎవరూ ఆయనవైపు చూడలేదు. ఇక్కడికొచ్చి మళ్లా తీస్ మార్ ఖాన్ లెక్క చక్రం తిప్పుతానని కథలు చెబ్తుండు. నీ ముఖం చెల్లడం లేదు. నీది చెల్లని రూపాయి. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహంతో ఉంది. దాన్ని దారి మళ్లించేందుకే డ్రామాలాడుతున్నవ్. రాజ్యాంగంలోని ఒక్క పేజీ కూడా మార్చలేవ్. మార్చాలని చూస్తే మాడి మసైపోతావ్. మాది గుప్పుడు పార్టీనా? నువ్వు పెట్టిన జనగామలోనే సభ పెడతా.. నీలెక్క బీరు, బిర్యానీ, 500 ఇవ్వం. మా కార్యకర్తలు గర్జిస్తే చెవుల్లో రక్తం కారాలి. సభ పెట్టేది ఖాయం. మా దమ్మేందో చూపిస్తాం. బీజేపీకి పిడికెడు మంది లేకపోతే.. అంత భయమెందుకు? ఎందుకు అడుగడుగునా అరెస్ట్ చేస్తున్నవ్? ఎందుకు సభలో బెదిరిస్తున్నవ్? ఎందుకు టార్గెట్ చేస్తున్నవ్? మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నవ్.. పోలీసులతో కొట్టిస్తున్నవ్? దాడులు చేయిస్తున్నవ్? కాళ్లు చేతులు విరిగినా సరే.. భయపడే ప్రసక్తే లేదు. జనం కోసం ఎంతకైనా పోరాడేందుకు సిద్ధం. నీకు, నీ పార్టీ నాయకులకు దమ్ముంటే.. పోలీసుల రక్షణ లేకుండా గ్రామాల్లో తిరిగి చూడు.. జనమే మిమ్ముల్ని తరిమితరిమి కొడతారు’ అని కేసీఆర్ ను హెచ్చరించారు.
ఇప్పటికైనా సీఎం స్పందించాలని… 317 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు సంజయ్. నిరుద్యోగ భృతితోపాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. పంట చేతికొచ్చే సమయమైంది.. ధాన్యం కొనేందుకు సిద్ధం కావాలని.. డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్దిదారులకు ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కించేదాకా వదిలే ప్రసక్తే లేదన్న బండి… నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లెక్క పారిపోదామనుకుంటే కుదరదన్నారు. అయినా.. దొంగ పాస్ పోర్టులు కేసీఆర్ కు అలవాటేనన్న బండి.. ఇకపై ఆటలు సాగవన్నారు. కేసీఆర్ ను రాష్ట్రం వదిలి పోనియ్యమని.. జైల్లో పెట్టడం ఖాయమని హెచ్చరించారు. ‘మోడీని ఎందుకు తరిమికొట్టాలి? లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకున్నందుకా? దేశానికి ఫ్రీ వ్యాక్సిన్ అందించినందుకా? 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసినందుకా? ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా? ప్రపంచంలోనే గొప్ప ప్రధానిగా పేరు తెచ్చుకున్నందుకా? అసలు నువ్వు చేస్తుందేంటి? నీ భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నరు. నువ్వు మాట్లాడే బూతులు తెలంగాణ భాష కాదు.. నీ భాషను చూసి ఛీ.. థూ అంటున్నరు. ఇకనైనా భాష మార్చుకో. తక్షణమే రాజ్యాంగాన్ని కించపర్చిన విషయంలో, తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడిన తీరుతోపాటు మోడీపై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో ఇచ్చిన మాటను నిలబెట్టుకో. 317 జీవోను సవరించాలని ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం.. దాడులు చేయడం దారుణం. తక్షణమే అరెస్టు చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలి. గాయపడ్డ వారికి చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో 20 వేల ఉద్యోగాలు ఊడగొట్టిన సీఎంకు బీజేపీపై విమర్శలు చేసే అర్హత లేదు’ అంటూ విమర్శలు చేశారు బండి సంజయ్.