– తీట మాటలు మాట్లాడితే తాట తీస్తాం..
– సీఎంకు బండి వార్నింగ్
– నిరుద్యోగులారా.. తస్మాత్ జాగ్రత్త
– మరో మోసానికి తెర తీస్తుండు..!
– 1.91 లక్షల ఉద్యోగాలిచ్చేదాకా వదలిపెట్టొద్దు!
– బకాయిలతో సహా భృతి ఇవ్వాల్సిందే!
హిందూ ధర్మాన్ని కించపరిస్తే కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వనపర్తి వేదికగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడారు. ‘నీ సంగతి చూస్తం. అసలు నువ్వెంత? నీ పార్టీ బలమెంత? కాషాయ జెండా అంటేనే ధర్మం కోసం నిలబడి కలబడే జెండా.. న్యాయం కోసం పరితపించే జెండా’ అంటూ కేసీఆర్ ను హెచ్చరించారు. సీఎంను ఉద్దేశించి గురువు గారు అని సంబోధించారు బండి. ఆయనకు కాషాయ జెండా సెగ తగిలిందన్నారు. కాషాయ జెండాను నమ్ముకున్నోడికి ఆసరా ఇస్తుంది.. ద్రోహం చేస్తే అథ:పాతాళానికి తొక్కేస్తుందని కేసీఆర్ కు అర్థమైందని సెటైర్లు వేశారు.
5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ లో 4 రాష్ట్రాల్లో బీజేపీ కాషాయ జెండా ఎగరేయబోతుందని తెలిసి కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు సంజయ్. ‘దేశమంతా తిరుగుతా… ఏదో ఉద్దరిస్తానని మొన్నటి దాకా బడాయి మాటలు చెప్పిండు. 10వ తేదీనాడు భారత రాజకీయాలను మలుపు తిప్పే రిజల్ట్స్ రాబోతున్నయ్. అందుకే దాన్ని డైవర్ట్ చేసేందుకు మరో జిమ్మిక్కు చేయబోతుండు. 8 ఏళ్ల నుండి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుండు. అసెంబ్లీలో ఏం ప్రకటిస్తవో… ప్రకటించు.. కానీ అంతకు ముందే ప్రతి నిరుద్యోగ తమ్ముడు, చెల్లికి ఒక్కొక్కరికి బకాయిపడ్డ రూ.1.20 లక్షల భృతి చెల్లించి ఏదైనా మాట్లాడు’ అంటూ విమర్శించారు బండి.
కేసీఆర్ కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చారని.. ఒక ప్రకటన చేసి వదిలేస్తే ఇగ మళ్లీ మాయలో పడిపోతారని అనుకుంటున్నారన్నారు. ‘నీ జేజెమ్మను కూడా వదలం. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే. పదివేలో, 20 వేలో ప్రకటించి చేతులు దులుపుకుంటానంటే ఊరుకునేది లేదు. అదేదో గొప్పగ చెబుతున్నవ్? నీ ఇంట్లకెళ్లి ఇస్తున్నవా? ఈ 8 ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగులను బలి తీసుకున్నవ్? తుగ్లక్ ముఖ్యమంత్రిగారు జర జాగ్రత్తగా మాట్లాడు. కాషాయ జెండాను, బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతవా? నీకా దమ్ముందా? దేశంలో పచ్చ జెండా ఎంఐఎం ఎజెండాను విస్తరింపజేయడానికి ప్రణాళిక చేస్తున్నవా? నీలాంటి కొన్ని వందల మంది బీజేపీని కనుమరుగు చేద్దామని రహస్య ఎజెండాను అమలు చేసి తీరా ఏమీ చేయలేక వాళ్లే కనపడకుండాపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడుంది? కమ్యూనిస్టులు ఎక్కడున్నరు? నువ్వెంత ? నీ బతుకెంత? నీ పార్టీ ఎంత? నీ పార్టీ బలమెంత? మంది దగ్గర గెల్చినోళ్లను తెచ్చుకుని బలమని మురిసిపోతున్నవ్. అది బలం కాదు.. వాపు మాత్రమే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాషాయ జెండా అంటేనే ధర్మం కోసం నిలబడే జెండా.. న్యాయం కోసం పరితపించే జెండా.. ఇది త్యాగాల జెండా అని చెప్పారు సంజయ్. తమను బంగాళాఖాతంలో కలుపడం కేసీఆర్ తరం కాదన్నారు. ప్రపంచ గోల్ మాల్ గోవిందలకు అధ్యక్షుడే కేసీఆర్ అని.. ఆ కేటగిరిలో గోల్డ్ మెడల్ కూడా ఇవ్వొచ్చన్నారు. ‘అబద్దాలాడేటోళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే అంతకుమించి పురస్కార్ నీకే ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమం తరువాత అధికారం చేపట్టినప్పటి నుండి అడుగడుగునా గోల్ మాల్ చేసినవ్. తెలంగాణ ఉద్యమ కారులను మోసం చేసినవ్? నిరుద్యోగులను రోడ్డు పాల్జేసినవ్… రైతులను మోసం చేసినవ్… చివరకు ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేసి తమాషా చూస్తున్నవ్? తెలంగాణను బంగారు తెలంగాణను చేసిండట.. దేశాన్ని బంగారు భారత్ చేస్తడట.. చెప్పడానికైనా నీకు కొంచెమైనా సిగ్గన్పించడం లేదా? ఏనాడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నవా? ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పరిధి రాష్ట్రాలదేనని చెప్పి చాలా ఏళ్లుగా అనేక తీర్పులు, చట్టాలు చెబుతున్నా.. నువ్వు మాత్రం ఓ కాగితం పడేసి ఎస్టీ రిజర్వేషన్లు కేంద్రం ఇవ్వడం లేదని నింద వేస్తున్నవ్? అసెంబ్లీలో తీర్మానం చేస్తే మమ అన్పించుకోవడం నీకలవాటే. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాల్మీకి బోయలను ఏనాడో న్యాయం జరిగేది. ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెరిగేవి. కానీ.. ఇవేవీ నువ్వు చేయవ్.. బీజేపీ మీద నింద వేయడానికి రెడీగా ఉంటావ్. మమ్మల్ని మతపిచ్చి గాళ్లంటవా? ఎస్.. మేం హిందూ ధర్మం కోసం ప్రాణమిచ్చేంత మత పిచ్చిగాళ్లమే. నువ్వు ఓట్ల కోసం హిందూ వేషం వేస్తవ్? సీఎం సీటు కోసం మంత్రాలు, తంత్రాలు చేస్తవ్. నీ ఫాంహౌస్ లో క్షుద్ర పూజలు చేస్తవ్. మళ్లా రజాకార్లను తలమీద పెట్టుకుని ఊరేగుతవ్? ఇంతకీ రజాకార్లు ఎవరు? మతపిచ్చగాళ్లు కాదా? హిందూ ధర్మానికి అడ్డమొస్తే ఎంతటి వాళ్లనైనా చూస్తూ ఊరుకునేది లేదు. ఎంతదాకైనా పోతాం. ఖబడ్డార్ కేసీఆర్.. రాజకీయాలు మాట్లాడితే వదిలేస్తమేమో.. కానీ హిందూ ధర్మాన్ని కించపరిస్తే నీ సంగతి చూస్తం. ఇప్పటికే కరీంనగర్ గడ్డమీద ‘హిందూగాళ్లు.. బొందగాళ్లు’ అంటే ఏమైందో నీకు తెలుసు. గిట్లనే తీట మాటలు మాట్లాడితే తాట తీస్తం బిడ్డా. కేసీఆర్ నువ్వెన్ని వేషాలు వేసినా.. ఇంకెన్ని డ్రామాలు చేసినా.. చివరకు మిగిలేది పీకేలు.. బోకేలే. జనం నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు రాబోతున్నయ్? నువ్వు, నీ కొడుకు తట్టా బుట్టా సర్దుకుని దేశం విడిచిపోయే రోజులు రాబోతున్నయ్’ అంటూ కేసీఆర్ ను హెచ్చరించారు బండి సంజయ్.