– బీజేపీ నేతల హౌస్ అరెస్ట్ పై బండి ఫైర్
– కార్యకర్తలను పరామర్శించే స్వేచ్ఛ లేదా?
– ప్రజల ప్రాణాల కంటే సీఎం సభే ముఖ్యమా?
– అంబేద్కర్ రాజ్యాంగం కావాలా?
– కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా?
– ప్రజలంతా ఆలోచించాలన్న బండి
తెలంగాణలో బీజేపీ నేతల హౌజ్ అరెస్ట్ లు, కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందన్నారు. 317 జీవోపై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులనూ ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు… పింకీల నిరసనలకు మాత్రం అనుమతినివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు.
తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే అమలవుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు బండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలా? నిర్బంధాల, హౌజ్ అరెస్ట్ ల కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బీజేపీ అడ్డుకుని తీరుతుందని… ఇందుకోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.
జనగామలో టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయాలపాలైన బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి బయలుదేరిన బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు సంజయ్. గాయాలపాలైన కార్యకర్తలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టామిట్టాడుతుంటే… పోలీసులకు మాత్రం ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమంత్రి సభే ముఖ్యమైందని మండిపడ్డారు.
నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు, ఉద్యమకారులు ఎంతటి ఇబ్బందులు పడ్డారో.. కల్వకుంట్ల పాలనలోనూ అదే పరిస్థితి కొనసాగుతోందన్నారు బండి. నిర్బంధాలతో పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ను ప్రజల అష్టదిగ్బంధం చేసి ఫాంహౌజ్ కే శాశ్వతంగా పరిమితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. బీజేపీ పోలీసుల నిర్బంధాలు, టీఆర్ఎస్ గూండాల దాడులతో బెదిరిపోదన్న బండి.. కల్వకుంట్ల పాలనను సమాధి చేసే వరకు పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.