– ఎన్ఐఏ వచ్చేదాకా కేసీఆర్ ఏం చేస్తున్నారు?
– రాష్ట్ర భవిష్యత్తుపై సోయి ఉందా?
– హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యం
– పాదయాత్రలో బండి నిప్పులు
హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణలో విస్తరిస్తుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ లో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి సర్కార్ కు సోయి ఎందుకు లేదన్నారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.
పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థల్ని టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. జిమ్, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్ఐ విస్తరిస్తోందని నిప్పులు చెరిగారు. 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసిందన్నారు. హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణలో విస్తరిస్తుంటే కేసీఆర్ కు సిగ్గు లేదా? అని మండిపడ్డారు. హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమన్నారు.
ఏ స్కాం బయటపడినా.. కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంటోందని బండి సంజయ్ ఆరోపించారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న కేసీఆర్.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి.. క్వారంటైన్ కు పోతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటేదాకా తరిమి కొట్టేదాకా విశ్రమించబోమని అన్నారు.
కేంద్రం ఇండ్లు మంజూరు చేసినా లెక్క చెప్పని కేసీఆర్.. భూములున్నా పట్టాలివ్వని దుర్మార్గుడని మండిపడ్డారు బండి. రిజిస్ట్రేషన్ల బంద్ తో నానా అవస్థలు పడుతున్న వేలాది మంది బాధితులు.. కేసీఆర్ కుటుంబానికి లంచాలిస్తే తప్ప పనులు కాని దుస్థితి ఉందని ఆరోపించారు. కుక్క తోక వంకర తరహా కేసీఆర్ తీరు ఉందని, ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లను అరెస్ట్ చేసి జైళ్లో పెడతారా? అని ధ్వజమెత్తారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండని ప్రజలను కోరారు.