– సీఎం వస్తుంటే జనం వణికిపోవాలా?
– కల్వకుంట్ల రాజ్యాంగంలో జీ హుజూర్ అంటూ..
– వంగి వంగి దండాలు పెట్టాలా?
– సీఎం ఫాంహౌజ్ దాటితే ప్రతిపక్ష నేతలు అరెస్టులు
– ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
– నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా?
– టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు.. సిగ్గుచేటు
ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపై బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌజ్ బయటకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీల నాయకులను హౌస్ అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. గత రెండ్రోజులుగా జనగామ జిల్లా కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్కడైనా ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తున్నారంటే జనం సంతోషపడతారు.. సమస్యలు పరిష్కారమవుతాయనే భావన ఉంటుందన్నారు బండి. కానీ.. కేసీఆర్ వస్తుంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. పోలీసుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారని.. సామాన్య ప్రజలను కట్టడి చేస్తూ నిర్బంధిస్తున్నారని అన్నారు. ఇంతటి దుర్మార్గమైన పాలన దేశంలో మరెక్కడా చూడలేదని విరుచుకుపడ్డారు.
కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ కో న్యాయం.. బీజేపీ కో న్యాయం అమలవుతోందని మండిపడ్డారు బండి. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మలు తగులబెట్టిన టీఆర్ఎస్ నేతలపై కేసులుండవు. పైగా రక్షణ కల్పిస్తారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెడితే మాత్రం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. కల్వకుంట్ల రాజ్యాంగమంటే ఇదేనా? కల్వకుంట్ల రాజ్యాంగం పూర్తిగా అమలైతే ప్రజలకు మరింత ప్రమాదం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ బయటకొస్తే.. చెప్పులు విడిచి జీ హుజూర్ అంటూ వంగి వంగి దండాలు పెట్టాలేమో’’అని ఎద్దేవా చేశారు.
రెండ్రోజులుగా పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేతలు, కార్యకర్తలను నిర్బంధించడం అన్యాయమన్నారు సంజయ్. ‘‘వాళ్లేమైనా ఉగ్రవాదులా? నిషేధిత సంస్థ సభ్యులా? సీఎంకు బీజేపీ కార్యకర్తలంటే ఎందుకంత భయం? తీవ్రవాదులకు మద్దతిచ్చే పార్టీల నాయకులు యథేచ్ఛగా తిరుగుతుంటే వారికి వత్తాసు పలుకుతూ ఆపార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కేసీఆర్ జనం కోసం పోరాడే బీజేపీ కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేయడమేంటి? పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్లు పాలన కొనసాగిస్తారు?’’ అంటూ మండిపడ్డారు.
టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించడానికి వెళుతుంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లను హౌస్ అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ ఖండించారు. ‘‘పోలీసుల సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారు. డీజీపీ, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా? అర్ధం కాక ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. మహోజ్వలిత పోరాటమైన తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ఈ దుస్థితి మరే రాష్ట్రంలో లేదు’’ అని దుయ్యబట్టారు.
ఒకప్పుడు పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుండేదని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ పేరును చెడగొట్టారని ఆరోపించారు బండి. కొంతమంది పోలీసులైతే ఏకంగా టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని… చివరకు వాహనాలకు సైతం టీఆర్ఎస్ జెండాలను పెట్టుకు తిరుగుతుండటం నీచాతినీచమని వ్యాఖ్యానించారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా.. ఎన్ని దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. నక్సల్స్ కు ఎదురొడ్డి నిలబడ్డ పార్టీ బీజేపీ అనే సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలని తెలిపారు. తక్షణమే అరెస్ట్ చేసిన కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలని, దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు బండి సంజయ్.