రాష్ట్రంలోని అన్ని గ్రామాల సర్పంచులు తమ నియంత్రణలో ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేశారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జాతీయ పంచాయతీరాజ్ దివాస్ సందర్భంగా నారాయణపేట జిల్లా నర్వలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో ఆయన సమావేశమయ్యారు.
బీజేపీ అధికారంలోకి వస్తే సర్పంచులు గ్రామాల్లో గల్ల ఎగరేసుకొని గౌరవంగా తిరిగేలా చేస్తామని పేర్కొన్నారు. కొత్తచట్టం పేరుతో సర్పంచులకు అధికారాలే లేకుండా చేశారని విమర్శించారు. ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చడంతో పాటు.. జడ్పీటీసీలంటే ఎవరో తెలియకుండా చేశారని మండిపడ్డారు.
ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచులకు 5 లక్షలు ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ జాడనే మరిచిందన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే.. వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరికీ గౌరవం కల్పించేలా సర్కారు వ్యవహరిస్తోందని హామీ ఇచ్చారు. అనర్హత వేటు వేస్తామంటూ సర్పంచులను అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ సర్పంచులు కూడా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఆయా స్థాయి ప్రభుత్వాలుండాలని బండి సంజయ్ తెలిపారు. పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఐదేళ్లలో ప్రతి గ్రామపంచాయతీకి సగటున కోటి రూపాయలిచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని చెప్పారు బండి సంజయ్.