– కొనుగోలు కేంద్రాలు తెరవాల్సిందే..
– ప్రతీ ధాన్యం గింజ కొనాల్సిందే..
– సమస్యలను దారి మళ్లించే జిమ్మిక్కులు ఆపాలి
– కేసీఆర్ కు బండి వార్నింగ్
కేసీఆర్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చొప్పదండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన బండి.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని ఎంపీ నిధులు కేటాయిస్తానన్నారు సంజయ్. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని… అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి రావాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు అందులో భాగంగానే బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు.
బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులన్నీ సీఎం డైరెక్షన్ లో పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నాయని విమర్శించారు బండి. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని.. గతంలో నల్గొండ, కరీంనగర్ లో తనపై.. ఆర్మూర్ లో అరవింద్ పై దాడి, కార్యకర్తలపై హత్యాయత్నం చేయడం సీఎం కుట్రలో భాగమేనని ఆరోపించారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నాగేశ్వరరావు అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి హత్య చేసేందుకు కుట్ర చేశారన్నారు సంజయ్. స్థానిక సీఐ బూతులు తిడుతూ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు సీఎంకు కొమ్ముకాస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదని వారిని హెచ్చరించారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు భయం పట్టుకుందని చురకలంటించారు బండి. అందుకే దాడుల పేరుతో బీజేపీని అడ్డుకుని భయానక వాతావరణం సృష్టించాలని అనుకుంటున్నారని వివరించారు. అరాచకాలు చేయాలి.. అక్రమాలు చేయాలి.. కోట్లు సంపాదించాలి.. ఆ సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసి గెలవాలన్నదే కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను మూసి వేస్తున్నట్లు సీఎం ప్రకటించడం దారుణమన్న బండి.. రైతులు ఎక్కడ అమ్ముకోవాలని నిలదీశారు. పంటలే వేయొద్దంటున్న కేసీఆర్… లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టించారని ప్రశ్నించారు. యాసంగిలోనూ రా రైస్ ను ఎంతైనా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అలాంటప్పుడు రైతుల నుండి ధాన్యం ఎందుకు కొనడం లేదో సీఎం జవాబు చెప్పాలని నిలదీశారు.
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అంగీకరిస్తూ ఒప్పంద పత్రాలపై సంతకం చేసింది నిజం కాదా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు బండి. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల బాధలను ఇకనైనా కేసీఆర్ పట్టించుకోవాలని.. దాడుల పేరుతో సమస్యలను దారి మళ్లించే జిమ్మిక్కులు మానుకోవాలని హితవు పలికారు. ఖరీఫ్ మాదిరిగా యాసంగిలో రైతులను ఇబ్బంది పెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అలాగే కేంద్రంపై నెపాన్ని మోపాలని చూస్తే రైతులే తిరగబడతారనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్.