– బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించరా?
– సీఎం మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట
– మహిళలంటే ఎందుకంత చులకన భావం
– బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తానంటే ఊరుకోం..
– కేసీఆర్ కు బండి సంజయ్ హెచ్చరిక
బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం మూర్ఖత్వమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. గవర్నర్ సొంత ప్రసంగం ఉండదని.. కేబినెట్ ఆమోదించిన స్పీచ్ నే అసెంబ్లీలో చదివి వినిపిస్తారని గుర్తు చేశారు. బహుశా కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమీ లేనట్లుంది. అందుకే ఇలా చేస్తున్నారేమో అని చెప్పారు.
సీఎంను గవర్నర్ ఎన్నడూ అవమానించలేదన్నారు బండి. ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయలేదని… ఇదే సీఎం గతంలో తమిళిసైని పొగిడారని గుర్తు చేశారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించలేదో కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు మహిళలంటే చులకన భావన అని… మొదటి నుండి కించపరచడం ఆయనకు అలవాటేనన్నారు. గవర్నర్ వ్యవస్థనే సీఎం కించపరుస్తున్నారని ఆరోపించారు.
మహళా గవర్నర్ ను అవమానించడమంటే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించినట్లేన్నారు బండి. ఇది మంచి పద్దతి కాదని… తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగాల్ తరహా రాజకీయాలు చేద్దామనుకుంటున్నారని.. బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇకనైనా ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని హతవు పలికారు. బరితెగించి ఏది పడితే అది చేస్తానంటే ప్రజలు తిరగబడతారని సీఎం గ్రహించాలన్నారు. పీకేతో కలిసి పనిచేసినా.. ఆ పీకేలు, గీకేలు ఏమీ చేయలేరనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు బండి. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇబ్బందులను గమనించారు. అన్నదాత సత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మంగళ శాసనాలు పొందడం సంతోషంగా ఉందన్నారు బండి. హిందూ బంధువులందరూ సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగించాలని భగవంతుడిని కోరుకున్నానని తెలిపారు. వేములవాడ ఆలయంలో సిస్టమ్ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డారు. సౌకర్యాలు.. తాగడానికి నీళ్లు లేవని విమర్శించారు. పార్కింగ్ కు అన్నీ ఇబ్బందులేనని… అధికారులకు ఎవరూ సహకరించడం లేదన్నారు.
ఆలయ అభివృద్ధికి నిధులివ్వడం లేదని.. ఏటా వంద కోట్లు ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదని మండిపడ్డారు సంజయ్. ఉన్న నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుండి నిధులు మంజూరు చేయిస్తానని పలుమార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా పేరు ప్రతిష్టలు, పంతాలు, రాజకీయాలకు పోకుండా వెంటనే ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని చెప్పారు. శివరాత్రి పండుగ తరువాత ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఎట్లా దారి మళ్లించాలనే దానిపై మాత్రం సమీక్షలు చేయడం కేసీఆర్ కు అలవాటైందని మండిపడ్డారు సంజయ్.