– ఖాకీల ముందే బీజేపీ శ్రేణులపై…
– టీఆర్ఎస్ గూండాల దాడులు
– పోలీసులూ.. సిగ్గుతో తలదించుకోండి!
– బెంగాల్ తరహా పాలనను కొనసాగనివ్వం..!
– కేంద్రంలో ఉంది మేమేనని గుర్తు పెట్టుకోండి!
– ప్రభుత్వం, పోలీసులపై బండి సంజయ్ ఫైర్
టీఆర్ఎస్ నాయకుల మాఫియా దందాకు పోలీస్ స్టేషన్లు అడ్డాలుగా మారిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. న్యాయం కోసం సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలపై పోలీస్ స్టేషన్లలోనే టీఆర్ఎస్ గూండాలు దాడులు చేస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో పోలీసులు ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు అంటకాగుతున్న పోలీసులు కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉందనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల జోనల్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న.. ప్రభుత్వం, పోలీసులపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక ఉందన్నారు సంజయ్. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ది పొందే కుట్రకు కేసీఆర్ తెరతీశారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలను పూర్తిగా కేంద్రాన్ని తిట్టడానికే వెచ్చించారన్న బండి.. బీజేపీ ఎమ్మెల్యేలను ఏ కారణం లేకుండానే సస్పెండ్ చేశారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారని, నిలదీస్తారనే భయంతోనే వాళ్లను సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. వారిని సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలని కోర్టు ఆదేశాలిచ్చినా వాటిని తుంగలో తొక్కారని ఫైరయ్యారు.
తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని.. వాస్తవానికి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వమే అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులిస్తోందన్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల మొదలు రేషన్ బియ్యం, రోడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, రైల్వే ప్రాజెక్టులు సహా ప్రతి గ్రామంలో జరుగుతున్న హరితహారం, ప్రకృతి వనం, స్మశానవాటికలు, రైతు వేదికల నిర్మాణాలు.. ఇలా వీటికి అయ్యే నిధులన్నీ కేంద్రం ఇస్తోందని తెలిపారు. అయినా కేంద్రం ఇవ్వలేదని టీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం బీజేపీని బద్నాం చేస్తోందని విరుచుకుపడ్డారు.
‘‘రాష్ట్రంలో టీఆర్ఎస్ మోసాలు ప్రజలకు అర్ధమైనయ్. దళిత బంధు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ సహా కేసీఆర్ ప్రభుత్వం ఇఛ్చిన హామీలేవీ అమలు చేయడం లేదని గ్రహించి ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దానిని దారి మళ్లించేందుకే కేంద్రాన్ని బద్నాం చేసే కుట్రకు కేసీఆర్ తెరలేపారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 4 రాష్ట్రాల్లో విజయం సాధించింది. దీనికి కారణం ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే. టీఆర్ఎస్ పాలనలో కేంద్ర నిధులు పూర్తిగా దారి మళ్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. కేంద్ర పథకాలను పూర్తి నీరు గారుస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మేలు జరుగుతుందనే భావిస్తున్నారు. ఈ విషయాన్ని తట్టుకోలేని టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. సిరిసిల్లలో యువకుడిపై అకారణంగా దాడి చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మద్యం తాగిన టీఆర్ఎస్ గూండాలు దాదాపు 200 మంది నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పోలీసులు కాపాడలేని పరిస్థితి. దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేస్తామని తొలుత చెప్పిన పోలీసులు… ఆ తరువాత మాట మార్చి బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. పైగా దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లకు వెళ్లి మంత్రులు పరామర్శించడమేంటి?’’ అంటూ మండిపడ్డారు బండి సంజయ్.
టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళుతున్న రాజాసింగ్ సహా ఇతర బీజేపీ నేతలను అడ్డుకుని స్టేషన్ కు తరలించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతోందని… సామాన్య ప్రజలు స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడుతున్నారని అన్నారు. పోలీసులు సిగ్గుతో తలదించుకోవాలని.. కొందరు ఐపీఎస్ లు టీఆర్ఎస్ తొత్తుల్లా మారారని విమర్శించారు. వారి వల్ల పోలీస్ వ్యవస్థ దారి తప్పుతోందని.. శాంతిభద్రతలు కాపాడాల్సిన వాళ్లే సమస్యను సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ సిరిసిల్ల, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, పాలమూరు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసి టీఆర్ఎస్ గూండాలు పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారని గుర్తు చేశారు. ‘‘పోలీసులారా.. గుండెపై చేయి వేసుకుని చెప్పండి. మీ డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? సామాన్య ప్రజలను, బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం న్యాయమేనా? టీఆర్ఎస్ నేతల అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే నాన్ బెయిల్ కేసులు పెట్టేలా హుకూం జారీ చేస్తారా? ఇది తెలంగాణ.. టీఆర్ఎస్ ఆటలను కొనసాగనివ్వం. తెగించి కొట్లాడే బీజేపీ కార్యకర్తలున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం బీజేపీ కార్యకర్తలు ఇకపై మరింతగా తెగించి కొట్లాడాలి. ప్రజాస్యామ్య తెలంగాణ నిర్మాణం కోసం పోరాడాలి. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేంద్ర నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లిస్తున్న విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతిమంగా ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉద్యమించాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ లకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని టీఆర్ఎస్ అవినీతి-కుటుంబ-నియంత పాలనపై పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కలిసికట్టుగా పోరాడదాం. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా బీజేపీ అండగా ఉంటుంది. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే వరకు పోరాటాన్ని కొనసాగించాలి’’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.