గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1600 గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. పదేళ్లుగా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమన్నారు.
గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులకు తీవ్ర కొరత ఏర్పడిందన్న బండి.. ఒక్కో ఐఏఎస్ 3, 4 పోస్టులకు ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 4 వేల గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే 2 వేల గ్రూప్-3 పోస్టులు, 40 వేల గ్రూప్-4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.
వేలాది గ్రూప్ పోస్టుల ఖాళీగా ఉండటంతో పాలన నత్తనడకన సాగుతోందని ఆరోపించారు బండి. పేదలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతున్నాయని అన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 25 ఏళ్లుగా భర్తీ చేయలేదని మండిపడ్డారు.
తక్షణమే ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సంజయ్. లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.