టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. పేపర్ లీక్ చేసిన నిందితుడు ప్రవీణ్కు అత్యధిక మార్కులా? అని ఆయన ప్రశ్నించారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 సహా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల పేపర్లన్నీ లీకయ్యాయని ఆయన ఆరోపించారు. ఇదిగో సాక్ష్యం అంటూ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఓఎంఆర్ షీట్ను ఆయన మీడియాకు విడుదల చేశారు.
ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కోసం ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా అని టీఎస్పీఎస్సీని ఆయన నిలదీశారు.
రెండు నెలల్లో జరిగే పరీక్షల పేపర్లు కేసీఆర్ టీమ్కు లీకయ్యాయని ఆరోపణలు చేశారు. సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయని ఆరోపణలు గుప్పించారు. ఉద్యోగాలు ఇవ్వలేక ఇంత దారుణాలకు ఒడిగడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలన్నారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాలన్నారు. లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ప్రగతిభవన్, టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.