తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం టీఆర్ఎస్ పేరును మార్చారని.. చాలా రోజులుగా తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. తాంత్రికుడి సూచనతోనే పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. మూడు నెలలకొకసారి నల్లపిల్లితో పూజలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా తాంత్రికుడి అనుమతి తీసుకుంటారని అన్నారు. దేశంలో సచివాలయానికి వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తాంత్రికుడి మాటలు విని కొత్త సచివాలయ భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు.
బండి సంచలన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో. మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
మంత్రి ట్వీట్ పై వెంటనే స్పందించారు సంజయ్. ‘‘ఆ ట్విట్టర్ టిల్లు గారి మాదక ద్రవ్యాల డోసేజ్ ని కంట్రోల్లో పెట్టండ్రా పింకీలు. మీలాంటి లంగాలూ, లఫంగాలతోనే సమాజానికి పెను ప్రమాదం. ఇంటి యజమానిని కరిచే కాపలా కుక్కలు.. కంటికి అంజనం రుద్దుకొని తిరిగే క్షుద్ర మంత్రగాళ్లు.. మాదక ద్రవ్యాలు సేవించే బ్లాక్ మెయిలర్స్.. మత్తెక్కి తైతక్కలాడే లిక్కర్ సీసాలు.. కాపలా కుక్కలా ఉండమని పదవిస్తే కచరా కుక్కలు పిచ్చెక్కి కరవడానికి ఊరి మీద పడ్డాయి. తన్ని తరిమేయకుంటే రాష్ట్రానికి, దేశానికే ప్రమాదం. పోయి వెటర్నరీ డాక్టర్ కు చూపించుకొండ్రా పింకీలు’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.