పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రధాని మోడీ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని.. ఈ సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని లేఖలో వివరించారు.
కేసీఆర్ నిర్ణయం కారణంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని చెప్పారు. తక్షణమే కటాఫ్ మార్కుల్లో మినహాయింపును ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీలకు 20 శాతం, బీసీలకు 25 శాతం, జనరల్ అభ్యర్థులకు 30 శాతం కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. దీంతో 40 మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీలు, 50 మార్కులు వచ్చిన బీసీలు, 60 మార్కులు వచ్చిన జనరల్ అభ్యర్థులకు మెయిన్ పరీక్ష రాయగలరు. ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపులివ్వకపోవడం వల్ల వారు కూడా జనరల్ అభ్యర్థుల మాదిరిగా ప్రిలిమ్స్ లో 60, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారే మెయిన్ పరీక్షకు అర్హులు అవుతారని లేఖలో వివరించారు సంజయ్.
ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ను సమరించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ లో 25 శాతం అంటే 60 మార్కులను కటాఫ్ గా నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు బండి సంజయ్.