సీఎం కేసీఆర్ కు మానవత్వం లేదని విమర్శించారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగరాజును కిరాతకంగా చంపేసినా సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబానికి ఇల్లు, ఉద్యోగంతోపాటు రూ.8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశించినా ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని మండిపడ్డారు. సీఎం తాగి ఫాంహౌజ్ లో పడుకుంటారు తప్ప పట్టించుకోరని ఆరోపించారు.
నాగరాజు కుటుంబ సభ్యుల శోకం, ఆర్ధిక దుస్థితి దళిత, ఇతర సంఘాలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు బండి. ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అబ్బాయిలను చంపేస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నాగరాజును నగరంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై నరికి చంపితే కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదన్నారు. కనీస బాధిత కుటుంబాన్ని పరామర్శించాలన్న సోయి లేకపోవడం బాధాకరమని మండిపడ్డారు. ఎంఐఎం నేతల పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని.. పాతబస్తీ పోవాలంటే కూడా సీఎంకు ఒవైసీ అనుమతి అవసరమంటూ ఎద్దేవ చేశారు.
రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా? అని ప్రశ్నించారు బండి. తమకు కూడా ఆయన ఎవరో తెలియదని కానిస్టేబుళ్లు చెబుతున్నారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఇంకెంత మంది రక్తం చిందిస్తే మీ కళ్ళు చల్లబడతాయి కేసీఆర్ అంటూ ఫైరయ్యారు. నాగరాజును హత్య చేసిన నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదని.. కేసీఆర్ వ్యవహార శైలిపై దళితులు అందరూ గమనించాలని కోరారు. దళిత బిడ్డ నాగరాజు హత్యను పరువు హత్యగానో, రెండు కుటుంబాల మధ్య గొడవగానో చిత్రీకరించడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికి వ్యక్తిగత హత్య కాదు.. ప్రేరేపిత చర్య.. హిందువులు ముస్లింలకు భయపడి ఉండేలా చేస్తున్న దుశ్చర్య అని వ్యాఖ్యానించారు.
మిర్యాలగూడలో ప్రేమ వివాహం చేసుకున్న దళితుడిని హత్య చేస్తే గాయిగాయి చేసిన సంఘాలు దళిత బిడ్డ నాగరాజు విషయంలో నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు సంజయ్. లవ్ జిహాదీ పేరిట ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, లోబర్చి, అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే నోరెందుకు మెదపరని నిలదీశారు. ‘‘ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేశారు. ఇది మొదటిది కాదు.. రెండేళ్ల క్రితం గుంటూరులో ఇలాగే జరిగింది. గురజాల వరకు ఛేజ్ చేసి నరికి చంపారు. ఇలాంటి దుశ్చర్యలతో మొత్తం హిందూ సమాజాన్ని భయపెట్టి, తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ చేసిన కుట్ర ఇది. చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చి మొరిగే అయ్యాకొడుకులు ఇప్పుడేమంటారు? నాగరాజు హత్య గురించి నోరెందుకు మెదపడం లేదు?. నిందితులను ఉరి శిక్ష వేయాలని బాధిత కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నకు సమధానమేది?. నాగరాజు హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను ఇంకా అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటు. వారికి ఎవరితో సంబంధాలున్నాయి, టీఆర్ఎస్ పాత్ర ఏమిటో చెప్పాలి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలకు టీఆర్ఎస్ నేతలే కారణమవుతున్నారు. యావత్ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ చూస్తుండగా నరికి చంపుతుంటే కనీసం కాపాడే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగే సమయంలో మొబైల్ లో చిత్రీకరించడం కంటే ముందు ప్రాణాలు కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా. నాగరాజు హత్య కేసులో నిందితులను శిక్షించడంతోపాటు దీని వెనక ఉన్న కుట్రను చేధించేదాకా బీజేపీ ఆందోళనలు కొనసాగిస్తుంది’’ అని స్పష్టం చేశారు బండి సంజయ్.