– టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ
– బీజేపీలోకి ఉద్యమకారులు చేరడం సంతోషం
– మునుగోడులో ఎగిరేది కాషాయ జెండానే..!
– బూర నర్సయ్యను కలిసిన బండి సంజయ్
టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈమధ్యే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లారు బీజేపీ నేతలు. బండితో పాటు మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ వివేక్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఈనెల 19న ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల సమక్షంలో నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.
నర్సయ్య నిజాయితీ పరుడని.. ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు బండి సంజయ్. ఉద్యమకారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్న ఆయన.. టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని విమర్శలు చేశారు. కేసీఆర్ ను ఒక గ్రామానికి ఇంచార్జ్ గా వేసేలా చేసిన ఘనత తమ పార్టీదేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని.. బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బూర నర్సయ్య మాట్లాడారు. కేంద్రాన్ని ఆకాశానికెత్తేశారు. పార్టీలతో సంబంధం లేకుండా మోడీ సర్కార్ అభివృద్ధికి సహకరిస్తోందని తెలిపారు. బీజేపీ సిద్ధాంతమైన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేది తన జీవిత ఫిలాసఫీ అని చెప్పారు. ఈ నెల 19న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం మారడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ ను కలవడం ఒక ఉద్యమంలా మారిందని విమర్శించారు నర్సయ్య.
బూర బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే.. టీఆర్ఎస్ నేతలు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ ఇవ్వలేదని విమర్శలు చేశారు. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం నడ్డాను కలిసిన ఫోటోను బయటపెట్టారు నర్సయ్య. అటు టీఆర్ఎస్ విమర్శలకు చెక్ పెడుతూ.. ఇటు బీజేపీలోకి చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఫోటో వదిలారు నర్సయ్య. ఇదే క్రమంలో లోయర్ ట్యాంక్ బండ్ లోని నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లారు బండి సంజయ్. బీజేపీలోకి వెల్ కమ్ చెప్పారు.