ఎంఐఎం నేత అక్బరుద్దీన్ హేట్ స్పీచ్ కేసులు కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునివ్వడంపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్కక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. ప్రజలు ఈ మూడు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని.. నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీల్ కు వెళ్లాలన్నారు.
అక్బరుద్దీన్ కేసులను న్యాయ స్థానం కొట్టివేయడం విస్మయం కలిగిస్తోందన్నారు బండి. “15 నిమిషాలు సమయమిస్తే హిందువులందరినీ నరికి చంపుతామంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసింది… విన్నదని… అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని చెప్పారు. ఈ విషయంలో తాము కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం లేదని.. న్యాయస్థానానికి దురుద్దేశాలు ఆపాదించడం లేదని తెలిపారు.
న్యాయ స్థానానికి కావాల్సింది ఆధారాలు, సాక్ష్యాలేనని.. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని ఆరోపించారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్కక్కయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు బండి. అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడం ఎంఐఎం పార్టీకి అలవాటేనని… 2009లో అక్బరుద్దీన్ పై కేసు నమోదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంతో కుమ్కక్కై కేసును నీరుగార్చిందని మండిపడ్డారు.
హిందూ దేవతలను అవమానపరుస్తూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై 2012లో నిజామాబాద్ లో నమోదైన కేసును బెన్ ఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టివేసింది న్యాయస్థానం. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్ కు వెళ్లాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేశారు బండి. కాంగ్రెస్-టీఆర్ఎస్-ఎంఐఎం కుమక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని… సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.