సోమేష్ క్యాడర్ విషయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు తమదైన రీతిలో రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ.. తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టు తీర్పును పాటిస్తూ సీఎస్ ను ఏపీకి సాగనంపాలన్నారు.
2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమన్నారు బండి సంజయ్. ఇప్పటికైనా తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని సీఎస్ గా నియమించాలని సూచించారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించబడ్డ అధికారులను ఆ రాష్ట్రానికి బదలాయించాలని డిమాండ్ చేశారు
ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ చట్టాలను, రాజ్యాంగాన్ని, కేంద్ర నిబంధనలను గౌరవించలేదన్నారు బండి. తన రాజకీయ అవసరాల కోసం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కేటాయించబడ్డ ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డ సోమేష్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడం ద్వారా కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారని ఆరోపించారు.
317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేష్ ద్వారా విడుదల చేయించారని గుర్తు చేశారు సంజయ్. హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేష్ ను వాడుకున్నారని ఆరోపించారు.