టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపుతో మోయలేని భారాన్ని మోపిందని మండిపడ్డారు. ఈ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. కేసీఆర్ సర్కార్ పేదల నడ్డి విరుస్తోందని విమర్శించారు.
పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయడం చేతగాని ప్రభుత్వం.. ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని ఆరోపించారు. అట్లాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా.. అందులో ప్రభుత్వ శాఖలకు చెందినవే రూ.12,598 కోట్లు ఉండటం దారుణమన్నారు. వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ. 4,603 కోట్లు కాగా… అందులో అత్యధికంగా పాతబస్తీవేనని వివరించారు సంజయ్.
తన శాఖలు వాడుకున్న కరెంట్ కు బిల్లులు చెల్లించకపోగా.. పాతబస్తీలో వసూలు చేయలేకపోవడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఈ లోటును పూడ్చుకునేందుకు సామాన్య ప్రజలపై ఛార్జీల పెంపు పేరుతో భారం మోపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కరెంట్ ఛార్జీలు తగ్గించేవరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కరెంట్ ఛార్జీల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పేదల నుండి మధ్య తరగతి వరకు ఎవరినీ వదలకుండా ఛార్జీల పెంపుతో కరెంట్ షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు బండి సంజయ్.